భారతీయ కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మరోమారు వార్తలకెక్కారు. క్రికెట్ పట్ల అమితాసక్తిని ప్రదర్శించే ఈ పారిశ్రామికవేత్త.. ఈనెల రెండో తేదీన ముంబైలో జరిగే ప్రపంచ కప్ పైనల్ మ్యాచ్ను వీక్షించేందుకు రూ.5 కోట్లు వెచ్చించి మ్యాచ్ టిక్కెట్లను కొనుగోలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
రూ.కోట్లు విలువ చేసే వ్యాపార వ్యవహారాలను చక్కదిద్దుతూ ఎప్పుడూ బిజీ బిజీగా గడిపే అంబానీ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ను ప్రత్యక్షంగా స్టేడియంలో వీక్షించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందుకోసం ఐదు కోట్ల రూపాయాలు చెల్లించి మరీ మూడు కార్పోరేట్ బాక్స్లను బుకింగ్ చేసుకున్నారు.
తన కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి చూసేందుకు ఎమ్సిఏ పెవిలియన్లో ఉన్న మూడు కార్పొరేట్ బాక్స్లను ఈయన రిజర్వు చేయించుకున్నారు. ఈ కార్పొరేట్ బాక్స్లు స్టేడియంలోనే అత్యున్నత సౌకర్యాలు కలిగిన బాక్సులని ముంబై క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి లాల్చంద్ రాజ్పుట్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఒక్కో బాక్సులో 15-16 సీట్లు ఉంటాయి. ఈ మూడు బాక్సుల కోసం ముఖేష్ అంబానీ వెచ్చించిన దాని ప్రకారం ఒక్కో సీటు ఖరీదు 10 లక్షల పైమాటే.. ఇంకా చెప్పాలంటే.. ప్రతి బంతికి (ఒకవేళ ఇరుజట్లు పూర్తిగా 50 ఓవర్లను ఆడినట్లయితే) ముఖేష్ రూ.1650 చెల్లిస్తున్నట్టుగా లెక్కించవచ్చు.
ఈ ప్రపంచ కప్ కోసం బీసీసీఐ నిర్ణయించిన కనిష్ట (చీపెస్ట్ టిక్కెట్) ధర రూ.1500 మాత్రమే. ఆ ప్రకారంగా చూసుకుంటే అంబానీ కొనుగోలు చేసిన టికెట్ సాధారణ టికెట్ కన్నా 150 రెట్లు అధికమన్నమాట. అయితే.. ఈ బాక్సులలో సదుపాయాలు కూడా వెచ్చించిన దానికి ధీటుగానే ఉంటాయి.
పూర్తి ఎయిర్ కన్డీషన్డ్ సదుపాయంతో పాటు ఎల్సిడి టివి, వీడియో మాట్రిక్స్ స్కోర్ కార్డ్స్, డ్రింక్స్, స్నాక్స్ అందించడానికి వ్యక్తిగత సహాయకుడు ఇలా నక్షత్ర హోటల్లో ఉండే సదుపాయాలు ఉంటాయి. దటీస్ ముఖేష్ అంబానీ.