స్వదేశంలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ట్రిపుల్ సెంచరీ హీరో యూనిస్ ఖాన్, వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా రికార్డుపై కన్నేశాడు. లారా చేసిన 400 పరుగుల వ్యక్తిగత మైలురాయిని చేరుకునే దిశగా బ్యాటింగ్ చేస్తూ క్రీజ్లో పాతుకుపోయాడు. కరాచీలో జరుగుతున్న తొలి టెస్టులో పాక్ జట్టు కెప్టెన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న యూనిస్ ఖాన్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 337 పరుగులు వ్యక్తిగత స్కోరుతో అజేయంగా నిలిచిన విషయం తెల్సిందే.
బుధవారం ఒక్కరోజు సమయం, 90 ఓవర్లు, చేతిలో ఐదు మరో ఐదు వికెట్లు ఉండటంతో టెయిల్ ఎండ్ల సాయంతో తన వ్యక్తిగత (400) స్కోరను చేరుకుని తన కలను సాకారం చేసుకోవాలని యూనిస్ భావిస్తున్నాడు. దీనిపై నాలుగో రోజు మ్యాచ్ అనంతరం యూనిస్ మాట్లాడుతూ ఐదు రోజైన బుధవారం మరో 40 ఓవర్ల పాటు ఆడాలని భావిస్తున్నాను. ఇదే జరిగితే టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన లారా రికార్డు చేరుకుంటానని విశ్వాసం వ్యక్తం చేశాడు.
అయితే, జట్టు మేనేజ్మెంట్, కోచ్, సహచరుల సలహాల మేరకు నడుచుకుంటానన్నాడు. ఇదిలావుండగా, కరాచీ పిచ్పై యూనిస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇలాంటి నిర్జీవమైన పిచ్లపై టెస్టులు ఆడటం క్రికెట్ అభిమానులను నిరాశపరిచినట్టేనని యూనిస్ అభిప్రాయపడ్డాడు.
కాగా, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి పాక్ జట్టు తన తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల నష్టానికి 574 పరుగులతో శ్రీలంకకు ధీటైన జవాబిచ్చింది. అంతకుముందు లంక జట్టు ఏడు వికెట్ల నష్టానికి 677 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన విషయం తెల్సిందే.