లలిత్ మోడీకి బదులు మనోహరా..? వద్దు బాబోయ్..!: ఓనర్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఛైర్మన్ లలిత్ మోడీ స్థానంలో శశాంక్ మనోహర్ను నియమించడాన్నిఐపీఎల్ జట్ల యజమానులు వ్యతిరేకిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. లలిత్ మోడీ స్థానంలో శశాంక్ మనోహర్ నియామకం అసలొద్దని ఐపీఎల్ యజమానులు తెలిపినట్లు సమాచారం. ఐపీఎల్లో ఆర్థికపరమైన అవకతవకలకు పాల్పడ్డారంటూ మోడీ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. లలిత్ మోడీని ఛైర్మన్ పదవి నుంచి తొలగించేందుకు బీసీసీఐ రంగం సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో శశాంక్ మనోహర్కు ఐపీఎల్ ఛైర్మన్ పదవులను అప్పగించాలని బీసీసీఐ భావిస్తోంది. కానీ లలిత్ మోడీ స్థానంలో శశాంక్ మనోహర్ను బీసీసీఐ నియమించడం పట్ల ఐపీఎల్ జట్లకు చెందిన యజమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించిన లలిత్ మోడీలోని నాయకత్వ లక్షణాలు.. శశాంక్ మనోహర్లో లేవని యజామానులు అంటున్నారట. ఇంకా ఐపీఎల్ను సమర్థవంతంగా నిర్వహించే సత్తా లలిత్ మోడీలోనే ఉందని, అయితే శశాంక్ మనోహర్కు అంత సీన్లేదని యజమానులు చెబుతున్నట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. లలిత్ మోడీపై వేటు వేసేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ కేంద్ర మంత్రి శరద్ పవార్తో సమావేశమయ్యారు. మరోవైపు దేశ ప్రధాని మన్మోహన్ సింగ్కు ఐపీఎల్ వ్యవహారంపై బీసీసీఐ మీడియా మరియు ఫైనాన్స్ కమిటీ ఛైర్మన్ రాజీవ్ శుక్లా తెలియజేశారు. దీంతో ఈ నెల 26న జరిగే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్కు అనంతం బీసీసీఐ లలిత్ మోడీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరుపుతుంది.