38వ రంజీ ట్రోఫీ టైటిల్ను గెలుచుకోవడంలో ముంబయి జట్టును ముందుండి నడిపించి కీలకపాత్ర పోషించిన ప్రవీణ్ అమ్రే ఇండియన్ ప్రీమియర్ లీగ్లోని ముంబయి ఇండియన్స్ జట్టుకు కోచ్గా వ్యవహరించబోతున్నారు. దక్షిణాఫ్రికాలో జరగబోతున్న ఐపీఎల్ రెండో సీజన్లో ముంబయి ఇండియన్స్కు అమ్రేను కోచ్గా నియమించినట్లు జట్టు ఫ్రాంఛైజీ వెల్లడించింది.
ప్రారంభ సీజన్లో ముంబయి ఇండియన్స్కు టీం ఇండియా మాజీ ఓపెనర్ లాల్చంద్ రాజ్పుట్ కోచ్గా వ్యవహరించారు. ఆయన స్థానంలో మాజీ టెస్ట్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అమ్రేను నియమించామని ముంబయి ఇండియన్ ప్రతినిధి ఒకరు పీటీఐతో చెప్పారు. జట్టు ముఖ్య సలహాదారు, బౌలింగ్ కోచ్ షాన్ పొలాక్తో అమ్రే కలిసి పనిచేస్తారని చెప్పారు.
ముంబయి ఇండియన్స్కు జాంటీ రోడ్స్ ఫీల్డింగ్ కోచ్గా వ్యవహరిస్తున్నారు. జట్టు ఐపీఎల్ రెండో సీజన్లో ఆడేందుకు ఏప్రిల్ 7న దక్షిణాఫ్రికా బయలుదేరి వెళ్లనున్నారు. అయితే న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న కెప్టెన్ సచిన్ టెండూల్కర్, ఇతర ప్రధాన ఆటగాళ్లు జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, ధావల్ కులకర్ణి మాత్రం ఏప్రిల్ 9న బయలుదేరతారు.