పాకిస్థాన్ క్రికెటర్లకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చేలా ఆ దేశ క్రికెట్ బోర్డు చర్యలు చేపట్టింది. వచ్చే నెల 30వ తేదీ నుంచి ప్రారంభంకానున్న ప్రపంచ ట్వంటీ-20 ప్రపంచ కప్లో జట్టు సభ్యులు ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంది. ఇందులోభాగంగా, ట్వంటీ-20 మ్యాచ్ ఫీజులను అమాంతం పెంచింది. అలాగే, ఈ టోర్నీలో రాణించి డిఫెండింగ్ టైటిల్ను నిలబెట్టుకుంటే మ్యాచ్ ఫీజుతో పాటు.. 300 శాతం బోనస్ను కూడా అందజేస్తామని ప్రకటించింది.
కొత్తగా సెంట్రల్ కాంట్రాక్టులు పొందిన వారికి ఫీజుల పెంపు వర్తిస్తుంది. ట్వంటీ-20 ఫార్మెట్లోని మూడు కేటగిరీలకు చెందిన ఆటగాళ్లకు ఈ ఫీజుల పెంపు అమలవుతుంది. దీనిపై పీసీబీ వర్గాలు స్పందిస్తూ టెస్టులు, వన్డే మ్యాచ్లకు మాత్రం ఫీజులను పెంచలేదని వెల్లడించాయి. గత యేడాది ఉన్న ఫీజులనే యధావిధిగా కొనసాగిస్తుందని చెప్పాయి.
ట్వంటీ-20 మ్యాచ్లలో పాల్గొనే "ఏ" కేటగిరీలోని ఆటగాళ్ళకు రూ.1,50,000 నుంచి రూ.2,50,000లకు పెంచారు. అలాగే, "బి" కేటగిరీలో రూ.లక్ష నుంచి రెండు లక్షలు, "సి" కేటగిరీ ఆటగాళ్ల ఫీజులను రూ.75 నుంచి లక్షా యాభైవేల రూపాయలకు పెంచారు.
వీటితో పాటు ఐసీసీ నిర్వహించే మెగా ఈవెంట్లలో విజేతగా నిలిస్తే మొత్తం మ్యాచ్ ఫీజులో 300 శాతం బోనస్ ఇస్తామని ప్రకటించింది. అలాగే, భారత్ లేదా టాప్-4 జట్లపై వన్డే లేదా టెస్టు సిరీస్లను గెలుపొందితే 200 శాతం బోనస్ను అందజేయనుంది.
అలాగే, వ్యక్తిగత ప్రోత్సాహకాలను కూడా పీసీబీ ప్రకటించింది. మైదానంలో ప్రత్యర్థి ఆటగాడిని రనౌట్ చేసిన ఆటగాడికి రూ.లక్ష, టెస్టుల్లో సెంచరీ చేస్తే రూ.మూడు లక్షలు, డబుల్ సెంచరీ చేస్తే రూ.ఐదు లక్షల చొప్పున ప్రోత్సాహక బహుమతిని అందజేయాలని పీసీబీ నిర్ణయించింది.