ట్వంటీ-20 ప్రపంచ కప్: అమీతుమీకి సిద్ధమైన శ్రీలంక!
కరేబియన్ గడ్డపై జరుగుతున్న ఐసీసీ ట్వంటీ-20 ప్రపంచ కప్ టోర్నమెంట్లో ఓటమితో తన ప్రస్థానాన్ని కొనసాగించిన శ్రీలంక జట్టు.. సోమవారం చావోరేవో తేల్చుకోనుంది. తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైన లంకేయులు.. రెండో మ్యాచ్లో జింబాబ్వే జట్టుతో తలపడనున్నారు. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తేనే.. ఆజట్టు సూపర్ - 8 ఆశలు సజీవంగా ఉంటాయి. ఒకవేళ జింబాబ్వే చేతిలో లంక జట్టు ఓటమిపాలైతే లీగ్ దశలో టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. దీంతో అత్యంత కీలకమైన ఈ పోరులో లంకేయులు తమ సత్తా చాటేందుకు ఉవ్విళ్ళూరుతున్నారు. మరోవైపు వార్మప్ మ్యాచ్లలో డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్థాన్ జట్టును, పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టును ఓడించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న జింబాబ్వేతో సోమవారం జరిగే మ్యాచ్లో శ్రీలంక ఎలా నెగ్గుకొస్తుందో వేచిచూడాల్సిందే. గత ఏడాది టి-20 వరల్డ్ కప్లో మెరుపులు మెరిపించిన దిల్షాన్ ఇంకా గాడిన పడలేదు. సీనియర్ బ్యాట్స్మెన్ జయసూర్యతో పాటు.. లంక బౌలర్లు కూడా సత్తా మేరకు రాణించలేక పోతున్నారు. దీంతో లంక జట్టు కష్టాల కడలి నుంచి గట్టెక్కేలా కనిపిండం లేదు.