ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ పోటీలకు ఇంగ్లండ్ను వేదికగా ఖరారు చేసినట్టు ఐపీఎల్ కమిషనర్ లలిత్ మోడీ వెల్లడించారు. ఇందుకోసం ఆయన హుటాహుటిన సోమవారం ఇంగ్లండ్కు బయలుదేరి వెళ్లారు. లండన్ చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐపీఎల్ రెండో సీజన్ పోటీలను నిర్వహించేందుకు సరైన వేదిక ఇంగ్లండ్ అని చెప్పారు. భారీ షెడ్యూలుకు అనుగుణంగా మ్యాచ్లు నిర్వహించే వీలు ఇక్కడ ఉందన్నారు.
ఇతర వేదికలతో పోల్చితే ఇంగ్లాండ్ వాతావరణం ఐపీఎల్కు సరిగ్గా సరిపోతుందన్నారు. అయితే వేదికగా ఇంగ్లండ్ను ఖరారు చేసినట్టు ఆయన స్పష్టమైన, అధికారపూర్వక సమాచారం మాత్రం ఇవ్వలేదు. దీనిపై నేడో రేపో అధికారిక ప్రకటన విడుదల చేస్తామని మెలిక పెట్టారు. అదే సమయంలో ఐపీఎల్ టోర్నీని నిర్వహించేందుకు ఇటు ఇంగ్లండ్, అటు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డులు సంసిద్ధత వ్యక్తం చేశాయి.
పోటీల నిర్వహణకు అయ్యే ఖర్చు గురించి తాము ఆలోచించడం లేదని లలిత్ మోడీ స్పష్టం చేశారు. టోర్నీని భారత్ నుంచి ఇతర దేశాలకు తరలించేందుకు తీసుకున్న నిర్ణయం తమను బాధిస్తోందన్నారు. అనివార్య పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. భారత్లోనే మ్యాచ్ల నిర్వహణకు తాము ప్రయత్నించామని, అయితే ఎన్నికల కారణంగా భద్రత కల్పించలేమని, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తేల్చి చెప్పడం వల్లే ఈ పరిస్థితులు ఉత్పన్నమైనట్టు మోడీ వివరించారు.