ఐపీఎల్-3: కేకేఆర్తో డేర్డెవిల్స్ కీలక సమరం రేపే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్లో భాగంగా సౌరవ్ గంగూలీ సేన కోల్కతా నైట్ రైడర్స్తో ఢిల్లీ డేర్డెవిల్స్ తలపడనుంది. కోల్కతా వేదికగా బుధవారం జరిగే 39వ ఐపీఎల్ లీగ్ మ్యాచ్లో గౌతం గంభీర్ సేన కేకేఆర్ను ఓడించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఇప్పటికే 12 పాయింట్లతో ఐపీఎల్ పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతున్న ఢిల్లీ డేర్డెవిల్స్.. కేకేఆర్పై గట్టిపోటీని ప్రదర్శించే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఐపీఎల్ మూడో సీజన్లో ఇప్పటివరకు 9 మ్యాచ్లాడిన గౌతం గంభీర్ సేన డేర్డెవిల్స్ ఆరింటిలో విజయాలను, మిగిలిన మూడింటిలో పరాజయాల్ని చవిచూసింది. కాగా.. సెమీఫైనల్ ఆశలను సజీవం చేసుకునేందుకు గంగూలీ సేనపై నెగ్గి తీరాలని ఢిల్లీ భావిస్తోంది.మరోవైపు ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్లు ఆడిన కేకేఆర్, నాలుగింటిలో విజయాలు, మిగిలిన ఐదింటిలో ఓటమిని చవిచూసింది. దీంతో ప్రతి మ్యాచ్ను నెగ్గి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాలనుకుంటోంది. ఇందులో భాగంగా ఢిల్లీతో జరిగే మ్యాచ్లో తప్పకుండా గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది.ఇదిలా ఉంటే.. ఐపీఎల్ మూడో సీజన్లో విజయపరంపరను కొనసాగిస్తూ.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నాయకత్వం వహించే ముంబై ఇండియన్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. 8 మ్యాచ్లాడిన సచిన్ సేన కేవలం ఒక్క ఓటమిని మాత్రమే రుచిచూసి.. 14 పాయింట్లతో టాప్లో నిలిచింది. ఫలితంగా సెమీఫైనల్ ఆశలను సజీవం చేసుకుంది. అయితే.. బాలీవుడ్ నటి ప్రీతి జింటా ఫ్రాంచైజీ జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సెమీఫైనల్ బెర్త్ను చేతులారా పోగొట్టుకుంది. కానీ ఆదివారం జరిగిన 34వ లీగ్ మ్యాచ్లో పంజాబ్ ఎట్టకేలకు విజయం సాధించింది. ఇదే తరహాలో బుధవారం రాజస్థాన్ రాయల్స్తో జరిగే 38వ లీగ్ మ్యాచ్లోనూ నెగ్గాలని భావిస్తోంది.