అగర్తాలలో జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన విజయ్ హజారే క్రికెట్ ట్రోఫీని తమిళనాడు జట్టు కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో తమిళనాడు 66 పరుగుల తేడాతో బెంగాల్ జట్టును ఓడించి ట్రోఫీని గెలుపొందింది.
తమిళనాడు ఓపెనర్ అభివన్ ముకుంద్ అద్భుతమైన సెంచరీతో కీలక పాత్ర పోషించాడు. వరుస వైఫల్యాలతో ఫామ్ కోసం తంటాలు పడుతున్న అభినవ్ తన సత్తాను చాటుకుంటూ... అత్యధికంగా 118 పరుగులు సాధించి జట్టుకు భారీ స్కోరును అందించాడు. 140 బంతులు ఎదుర్కొన్న అభినవ్ 12 ఫోర్లు, ఒక సిక్సర్తో సెంచరీ సాధించాడు.
ఈ వన్డే టోర్నమెంట్లో ముందుగా బ్యాటింగ్ చేసిన తమిళనాడు జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 284 పరుగులు సాధించింది. అభివన్ లాగే.. ఎస్ విద్యుత్ 38, ఎస్ బద్రినాథ్ 30, మరో ఓపెనర్ ఎస్ అనిరుధ 26 పరుగులు సాధించి జట్టు స్కోరు బోర్డును పరుగులెత్తించారు.
అనంతరం... తమిళనాడు విధించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన బెంగాల్ జట్టు ప్రారంభంలోనే ఓపెనర్ గోస్వామి 9 పరుగులతో, దేబబ్రత దాస్ ఒక్క పరుగుతో వెనుదిరిగారు. అనంతరం వచ్చిన మనోజ్ తివార్ 76, వ్రిద్దిమాన్ సాహా 31 పరుగులు మినహా చెప్పుకోదగ్గ స్కోరు సాధించలేక పోయారు. ఫలితంగా... 45.2 ఓవర్లలోపు 218 పరుగులు సాధించిన బెంగాల్ జట్టు ఆలౌటయ్యింది.