టీం ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న "ది నేషనల్ బ్యాంక్ వన్డే సిరీస్"ను వరుణుడు వెంటాడుతూనే ఉన్నాడు. వెల్లింగ్టన్లో జరుగుతున్న రెండో వన్డే వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దయింది. వర్షం వల్ల మొదటి వన్డేను కూడా కుదించిన సంగతి తెలిసిందే.
శుక్రవారం వెల్లింగ్టన్లోని వెస్ట్ప్యాక్ స్టేడియంలో ప్రారంభమైన రెండో వన్డేలో భారత జోరుకు వరుణుడు పదే పదే అడ్డుపడ్డాడు. మ్యాచ్ ఆరంభం నుంచి అంతరాయం కలిగించిన వర్షం 29 ఓవర్లో ఎడతెరపి లేకుండా కురవడంతో రిఫరీలు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మ్యాచ్ ఆపే సమయానికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 188 పరుగులు సాధించింది.
అంతకుముందు టాస్ గెలిచిన భారత కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా బరిలో దిగిన వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్లు దూకుడుగా ఆడి స్కోర్ కార్డును పరుగులు పెట్టించారు. వీరోచితంగా ఆడి 32 బంతుల్లోనే అర్థ సెంచరీ చేసిన సెహ్వాగ్ 54 పరుగులకు అవుటయ్యాడు. అనంతరం సచిన్ తనదైన శైలిలో అద్భుత షాట్లతో అలరించి అర్థ సెంచరీకి చేరువయ్యాడు. 19 ఓవర్లు పూర్తయ్యే సరికి వర్షం మొదలయింది. మ్యాచ్కు అంతరాయం ఏర్పడింది.
ఆట మళ్లీ మొదలయిన తర్వాత సచిన్ అర్థ సంచరీ పూర్తి చేశాడు. అనంతరం కాసేపటికే సచిన్ (61) వెనుదిరిగాడు. ఆ తరువాత వచ్చిన యువరాజ్ సింగ్ డకౌట్ అయ్యాడు. 24 ఓవర్లు ముగిసే సరికి వర్షం మళ్లీ మొదలయింది. ఆ తర్వాత ఆట ప్రారంభమైన కొద్ది సేపటికి గంభీర్ (30) సైతం పెవిలియన్ దారి పట్టాడు. 28.4 వ ఓవర్ వద్ద మళ్లీ మొదలైన వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ఎంపైర్లు ప్రకటించారు. దీంతో రెండో వన్డే ఫలితం తేలకుండానే ముగిసింది.
ఇదిలా ఉంటే... కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ఫోన్లో బెదిరించిన తస్లీమ్ అనే వ్యక్తిని ఒరిస్సా పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. ఇతను చత్తిస్ఘడ్కు చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు. బెంగాల్లోని పురూలియాలో ఆయుధాలు జరావిడిచిన కేసుతో ఇతనికి సంబంధం ఉంది. ఢిల్లీలో హైప్రొఫైల్ హంతకుడిగా గుర్తింపు కూడా ఇతనికి ఉంది.