విస్డెన్ క్రికెటర్ మ్యాగజైన్ ముఖపుటలో సచిన్ టెండూల్కర్!
అంతర్జాతీయ క్రికెట్లో 20 ఏళ్ల ప్రస్థానాన్ని కొనసాగుతూ.. సరికొత్త రికార్డులు సృష్టిస్తోన్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తాజాగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన విస్డెన్ క్రికెటర్ మ్యాగజైన్ ముఖపుటలో కన్పించనున్నాడు. గ్వాలియర్లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో డబుల్ సెంచరీ చేసి, ప్రపంచ రికార్డు సృష్టించిన క్రికెట్ సూపర్ స్టార్ సచిన్ టెండూల్కర్ను గౌరవించే తరహాలో విస్డెన్ క్రికెటర్ మ్యాగజైన్ ఏప్రిల్ సంచికలో సచిన్ టెండూల్కర్ బొమ్మను ప్రింట్ చేసి ప్రచురించనుంది. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో కొనుగోలు చేయబడే ఈ పత్రికలో సచిన్ టెండూల్కర్ బొమ్మను ప్రచురించడంపై ఆ పత్రికా సంస్థ యాజమాన్యం చివరి నిమిషంలో నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై మ్యాగజైన్ ఎడిటర్ జాన్ స్టెర్న్ మాట్లాడుతూ.. గ్వాలియర్లో ఫిబ్రవరి 26న సచిన్ ఆడిన ఇన్నింగ్స్ అద్భుతమని కొనియాడారు. గ్వాలియర్ గడ్డపై డబుల్ సెంచరీ సాధించి సరికొత్త రికార్డు సృష్టించిన సచిన్ టెండూల్కర్, 40 ఏళ్ల వన్డే చరిత్రలో సాధించిన తొలి డబుల్ సెంచరీ అని పేర్కొన్నారు. ఇంకా గ్వాలియర్ వన్డేలో సచిన్ ఆటతీరు.. క్రికెట్ ఆటపై ఆయనకున్న తీరని కోరిక, సహనం, ఆతుత్ర ఎంతటిదనే విషయాన్ని నిరూపిస్తుందని ప్రశంసల వర్షం కురిపించారు. గ్వాలియర్లో డబుల్ సెంచరీని నమోదు చేసుకోవడం.. క్రికెట్ చరిత్రలోనే తిరుగులేని సూపర్ రికార్డ్ అని జాన్ కొనియాడారు. ఇకపోతే.. సచిన్ టెండూల్కర్ బొమ్మతో కూడిన విస్డెన్ క్రికెటర్ మ్యాగజైన్ ఏప్రిల్ సంచిక శుక్రవారం (26వతేదీ) విడుదల కానుంది.