త్వరలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగనున్న ఏడు మ్యాచ్ల వన్డే సిరీస్లో ఇరు జట్లకు సమాన అవకాశాలు ఉన్నట్టు క్రికెటర్ నుంచి పరోపకారిగా మారిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ స్టీవా జోస్యం చెప్పారు. శుక్రవారం ఆయన న్యూఢిల్లీలో మాట్లాడుతూ.. ఈ వన్డే సిరీస్ అత్యంత కఠినమైనదిగా అభివర్ణించారు.
ఛాంపియన్స్ ట్రోఫీలో పేలవమైన ప్రదర్శనతో ఇంటాబయటా విమర్శలు ఎదుర్కొంటున్న ధోనీ సేన స్వదేశంలో జరిగే వన్డే సిరీస్లో రాణించేందుకు సర్వశక్తులు ఒడ్డుతుందన్నారు. దీంతో ఇరు జట్ల మధ్య మహా పోరు తప్పదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆస్ట్రేలియా జట్టులో కొన్ని కొత్త ముఖాలకు చోటు కల్పించారు. ఇది ఆసక్తికర అంశం. ప్రస్తుతం ఆస్ట్రేలియా మంచి ఫామ్లో ఉంది. అయితే, టీమ్ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీలో పెద్దగా రాణించలేదని గుర్తు చేశారు. అనేకంగా సిరీస్ 4-3తో ఒక జట్టు గెలుచుకోవచ్చని, అయితే, ఇందులో ఏ జట్టు విజేతగా నిలుస్తుందో నాకు తెలియదని స్టీవ్ వా చెప్పారు.