చివరి బంతివరకు ఉత్కంఠభరితంగా సాగిన రెండో ట్వీంటీ20 మ్యాచ్లోనూ టీం ఇండియా ఘోర పరాజయం పాలయ్యింది. ఫలితంగా 5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించి, రెండు మ్యాచ్ల సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. కివీస్ కీపర్ మెక్కల్లమ్ 69 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. టీం ఇండియా బౌలర్లలో ఇర్ఫాన్ 2.. జహీర్ఖాన్, యువరాజ్ సింగ్లు చెరో వికెట్ను పడగొట్టారు.
టీం ఇండియా విధించిన 150 పరుగుల విజయలక్ష్యాన్ని అందుకునే దిశలో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ ప్రారంభం నుంచి బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు. ముఖ్యంగా ఓపెనర్ మెక్కల్లమ్ చివరివరకు అజేయంగా నిలిచి న్యూజిలాండ్ విజయాన్ని సునాయాసం చేశాడు. మెక్కల్లమ్కు తోడు టైలర్ 27, ఓపెనర్ రైడెర్ 26 పరుగులతో రాణించారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్కు ప్రారంభం నుంచే కష్టాలు ఎదురయ్యాయి. తొలి మ్యాచ్ తరహాలోనే రెండో ట్వంటీ20లో సైతం భారత్ బ్యాట్స్మెన్ తడబడ్డారు. దీంతో తొలి ట్వంటీ20 మ్యాచ్ తరహాలోనే భారత బ్యాట్స్మెన్ వరుసగా పెవిలియన్కు క్యూకట్టారు.
అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ యువరాజ్ సింగ్ (50) అర్థ సెంచరీ సాధించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. న్యూజిలాండ్ జట్టులో బట్లర్, బ్రైన్లు రెండేసి వికెట్లు సాధించగా... సౌతీ, వెటోరీలు ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
యువరాజ్ సింగ్ తర్వాత వరుసగా వికెట్లు పడుతుండటంతో కెప్టెన్ ధోనీ నిదానంగా ఆడుతూ. ధోనీ 30 బంతుల్లో 28 పరుగులు సాధించగా, ఇర్ఫాన్ పఠాన్ 15 పరుగులతో ఇద్దరూ నాటౌట్గా నిలిచారు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 149 పరుగులు మాత్రమే చేసింది. భారత బ్యాట్స్మెన్లో ధోనీ (27), సెహ్వాగ్ (24), రవీంద్ర జడేజా (19), పఠాన్ (15)లు మాత్రమే ఓ మోస్తరుగా పరుగులు సాధించారు.