ముంబైలో ఐపీఎల్ అవార్డు ఫంక్షన్: బీసీసీఐ బహిష్కరణ!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ అవార్డు ప్రదానోత్సవాన్ని బహిష్కరించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయం తీసుకుంది. ముంబైలో నేడు (ఏప్రిల్ 23) జరుగనున్న ఈ ఐపీఎల్ అవార్డు ఫంక్షన్లో పాల్గొనకూడదని బీసీసీఐ ఉన్నతాధికారులు తీర్మానించినట్లు వార్తలు వస్తున్నాయి.ముంబైలో వైభవోపేతంగా జరుగనున్న ఈ ఐపీఎల్ అవార్డు ప్రదానోత్సవం ఆహ్వాన లేఖలను బీసీసీఐతో పాటు ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్లు, సిబ్బంది, క్రికెటర్లకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ పంపింది. ఇంకా కేకేఆర్ యజమాని, బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ మరియు కరణ్ జోహర్లు ఆధ్వర్యంలో ఈ ఐపీఎల్ అవార్డు ప్రదానోత్సవం జరుగనుంది. కాగా.. ఐపీఎల్-3లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లను ఈ కార్యక్రమంలో ఐపీఎల్ సత్కరించనుంది.ఈ నేపథ్యంలో.. బీసీసీఐ ఛైర్మన్ శశాంక్ మనోహర్కు మద్దతు తెలుపుతూ.. లలిత్ మోడీ చర్యలను వ్యతిరేకిస్తూ.. ఈ అవార్డు ఫంక్షన్ను బహిష్కరించాలని బీసీసీఐ ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఐపీఎల్ పాలకమండలికి హాజరు కానని వ్యాఖ్యానించిన లలిత్ మోడీకి నిరసనగా ఐపీఎల్ అవార్డు ఫంక్షన్ను బహిష్కరించినట్లు బీసీసీఐ వర్గాల సమాచారం.