మితిమీరిన ఆవేశంతో, అడ్డూ అదుపూ లేని ఆగ్రహంతో ఎన్నెన్నో వివాదాల్లో ఇరుక్కున్న... ఆస్ట్రేలియా ఆల్రౌండర్ ఆండ్రూ సైమండ్స్ తానిప్పుడు పూర్తిగా మారిపోయానని చెబుతున్నాడు. కౌన్సెలింగ్ మూలంగా తనకిప్పుడు సహనం అలవడిందనీ, జీవితాన్ని ఇప్పుడు ఓ భిన్నమైన కోణంలోంచి చూస్తున్నానని అంటున్నాడు.
కౌన్సెలింగ్ పేరుతో కంప్యూటర్ విశ్లేషణలతో గంటలకొద్దీ కూర్చోబెట్టి ఊదరగొట్టడం లేదనీ... ఎంతో చక్కగా అది సాగుతోందని సైమో సంతోషం వ్యక్తం చేశాడు. గడ్డుకాలంలో తానెంతగానో నిరాశా నిస్పృహలకు లోనయ్యాననీ, వాటన్నింటినీ పారద్రోలిన కౌన్సెలింగ్ను ఇలాగే కొనసాగిస్తానని చెప్పాడు.
ఆస్ట్రేలియాలో కార్చిచ్చు, లాహోర్లో లంక క్రికెటర్లపై దాడిలాంటి సంఘటనలతో జీవితం ఎంత విలువైనదో తనకు పూర్తిగా అర్థమైందని సైమో పేర్కొన్నాడు. అందుకే త్రాగుడు అలవాటును కూడా నియంత్రించుకున్నాననీ, మందుకొట్టేటప్పుడు పరిమితుల్లో ఉంటున్నానని సైమండ్ వెల్లడించాడు.
ఇదిలా ఉంటే... పలుసార్లు వివాదాలలో కూరుకుపోయిన ఆండ్రూ సైమండ్స్ ఆసీస్ జట్టు నుంచి ఉద్వాసనకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సైమోకు కౌన్సెలింగ్ ఇప్పించాలని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయించింది. దీంతో సైమో బుద్ధిగా కౌన్సెలింగ్కు హాజరుకాక తప్పలేదు. ఏమైతేనేం ఈ కౌన్సెలింగ్ తన ఆలోచనా ధోరణిని పూర్తిగా మార్చివేసిందని ఇతగాడు చెబుతున్నాడు. అయితే, మైదానంలోకి వచ్చాక సైమో ప్రవర్తనాతీరును పరిశీలించినమీదటే మనకు నమ్మకం కలుగుతుందేమో చూద్దాం...!