ఇంగ్లండ్లో ఈ సంవత్సరం జూన్ నెలలో జరుగనున్న ట్వంటీ20 ప్రపంచకప్లో విజేతలుగా నిలిచే సత్తా కేవలం టీం ఇండియా లేదా పాకిస్థాన్ జట్లకు మాత్రమే ఉందని వెస్టిండీస్ బ్యాటింగ్ ధిగ్గజం బ్రియాన్ లారా అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ రెండు దేశాల బ్యాటింగ్ సామర్థ్యం, ప్రయోగాత్మక దృష్టి, ఇతర జట్లకంటే మెరుగైన స్థాయిలో ఉండటమే దీనికి ప్రధాన కారణమని అన్నాడు.
ఇంగ్లండ్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన ట్వంటీ20 మ్యాచ్ విరామ సమయంలో... లారా ప్రపంచకప్ ట్రోఫీని ప్రదర్శించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భారత్, పాక్ క్రికెట్ జట్లలో ఏదేని ఒకటి ట్వంటీ20 ఛాంపియన్గా నిలిచే అవకాశం ఉందనీ, ఎందుకంటే ఈ రెండు జట్లలోనూ అత్యుత్తమమైన బ్యాట్స్మెన్లు ఉన్నారని వ్యాఖ్యానించాడు.
అంతేగాకుండా...ఇంగ్లండ్ పిచ్లకు అలవాటుపడిన భారత్, పాక్లకే ట్రోఫీని కైవసం చేసుకునే సత్తా ఉందని లారా చెప్పాడు. ఇదిలా ఉంటే... ట్వంటీ20 టోర్నీలో వెస్టిండీస్ రాణించేందుకు కష్టమేననీ, ఆ జట్టులో క్రిస్గేల్, రామ్నరేశ్ శర్వాణ్, బ్రేవో లాంటి మేటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ... ప్రారంభ టోర్నీలో బంగ్లాతో అది ఓటమి చవిచూసిందని లారా వివరించాడు.
తానయితే టెస్ట్ క్రికెట్నే అమితంగా ఇష్టపడతాననీ, ఏ ఆటగాడికైనా టెస్ట్ల్లో రాణించడమే అసలైన సవాల్ అని లారా వెల్లడించాడు. అయితే, క్రికెట్లో ట్వంటీ20కి కూడా ఓ ప్రత్యేక స్థానం ఉన్న విషయాన్ని కూడా మర్చిపోనని ఈ మాజీ వెస్టిండీస్ సారథి పేర్కొన్నాడు.