ఐపీఎల్ రెండో సీజన్లో నైట్ రైడర్స్ కెప్టెన్సీ విషయంలో రొటేషన్ పద్ధతిని పాటిస్తామని నైట్రైడర్స్ కోచ్ బుకానన్ ప్రకటించారు. బెంగాల్ దాదా గంగూలీతో పాటు బ్రెండన్ మెక్ కల్లమ్, క్రిస్ గేల్, బ్రాడ్ హడ్జ్లు నాయకత్వ బాధ్యతలు నిర్వహిస్తారు. ఓ మ్యాచ్కు ఒకరి చొప్పున కెప్టెన్ను మారుస్తామని బుకానన్ చెప్పారు.
ఇందులో గంగూలీ ఫిట్నెస్, ప్రదర్శనకు ఎలాంటి సంబంధం లేదని బుకానన్ స్పష్టం చేశారు. ఒకవేళ ఈ రొటేషన్ పద్ధతి విఫలమైతే పూర్తి బాధ్యత గంగూలీదేనని ఆయన అన్నారు. కెప్టెన్సీ విషయంలో బెంగాల్ దాదాతో తనకెలాంటి విబేధాలు లేవని, బుధవారం గంగూలీ సమక్షంలోనే రొటేషన్ పాలసీని బుకానన్ ప్రకటించారు.
అయితే కెప్టెన్సీ విషయంలో నిరాశ చెందలేదా అన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు.. బుకానన్ కలుగజేసుకుని.. ప్రిన్స్ ఆఫ్ కోల్కతా అయిన గంగూలీకి, ఈ విధానం నిరాశనే మిగిల్చి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
ఈ విషయమై గంగూలీ మాట్లాడుతూ.. నైట్రైడర్స్ కోచ్ అయిన బుకానన్ ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చునని, ఆ అధికారం ఆయనకుందన్నారు. రొటేషన్ పాలసీ విధానం కొత్తదని, ఎలా ఉంటుందో భవిష్యతే తేలుస్తుందన్నారు. ఆటపైనే పూర్తి దృష్టిని సారించడమే తన లక్ష్యమని బెంగాల్ దాదా అన్నారు.
అయితే జట్టుకు నలుగురు కెప్టెన్లు ఉంటారని బుకానన్ చేసిన ప్రకటన, తుది నిర్ణయం కాదని దాదా స్పష్టం చేశారు. కెప్టెన్సీ విషయంలో ఇదే తుది నిర్ణయం కాని పక్షంలో తాను నిరాశ చెందాల్సిన అవసరం లేదని బెంగాల్ దాదా అన్నారు.
ఇదిలా ఉండగా.. ఆస్ట్రేలియా కోచ్లకు సౌరభ్ గంగూలీ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టడం ఇష్టం లేదని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. టీం ఇండియా కెప్టెన్ పదవి నుంచి, అప్పట్లో గంగూలీని తప్పించడంలో గ్రెగ్ ఛాపెల్ కీలక పాత్ర పోషిస్తే.. ప్రస్తుతం నైట్ రైడర్స్ కెప్టెన్సీ పదవి నుంచి దాదాను తొలగించేందుకే ఆ జట్టు ఆస్ట్రేలియా కోచ్ బుకానన్ రొటేషన్ పాలసీని ప్రకటించినట్లు వారు అభిప్రాయపడుతున్నారు.