ఐపీఎల్ చివరి లీగ్ మ్యాచ్: ముంబైపై కేకేఆర్ ఘనవిజయం!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్లో భాగంగా చివరి లీగ్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. ఈడెన్ గార్డెన్స్లో జరిగిన నామమాత్రపు ఐపీఎల్-3 చివరి లీగ్ మ్యాచ్లో సచిన్ టెండూల్కర్ సేన ముంబై ఇండియన్స్పై కేకేఆర్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 133 పరుగులు సాధించింది. ముంబై ఆటగాళ్లలో సౌరవ్ తివారీ (46: 37 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే రాణించాడు. ఈ మ్యాచ్లో హర్భజన్, జహీర్ఖాన్, మలింగ, పొలార్డ్లు విశ్రాంతి తీసుకున్నారు. దీంతో ముంబై కెప్టెన్సీ పగ్గాలు స్వీకరించిన బ్రేవో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మిడిలార్డర్లో సతీష్ (11), బ్రేవో (5), బిన్ని (8)లు ఘోరంగా విఫలం అయ్యారు. చివర్లో రాయుడు (27: 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో ముంబయి గౌరవ ప్రదమైన స్కోరును నమోదు చేసుకుంది. అనంతరం లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్ ఆటగాళ్లలో గంగూలీ (42: 36 బంతు ల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లు), మెక్కల్లమ్ (57 నాటౌట్: 56 బంతుల్లో 8 ఫోర్లు), డేవిడ్ హస్సీ (20 నాటౌట్: 14 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్)లు రాణించారు. దీంతో 133 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ 17.3 ఓవర్లలోనే ఛేదించింది.ఇకపోతే.. కేకేఆర్ బౌలర్లలో బాండ్, కార్తీక్ రెండేసి వికెట్లు పడగొట్టగా, దిండా, ఉనడ్కథ్, తివారీలు తలా ఒక్కో వికెట్ను తమ ఖాతాలో వేసుకున్నారు. ముంబై బౌలర్లలో సతీష్ మాత్రమే ఓ వికెట్ సాధించాడు.