Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చివరివరకు పోరాడిన శ్యామ్ కరన్... భారత్‌ను గెలిపించిన యార్కర్ కింగ్

చివరివరకు పోరాడిన శ్యామ్ కరన్... భారత్‌ను గెలిపించిన యార్కర్ కింగ్
, సోమవారం, 29 మార్చి 2021 (07:13 IST)
పూణె వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన చివరి వన్డే మ్యాచ్‌లో భారత్ ఆరు పరుగుల తేడాతో విజయభేరీమోగించింది. ఈ మ్యాచ్‌లో గెలుపు కోసం ఇంగ్లండ్ జట్టు చివరి బంతివరకు పోరాడింది. ముఖ్యంగా, ఆ జట్టు ఆటగాడు శ్యామ్ కరణ్ చివరి వరకు భారత్‌ను హడలెత్తించాడు. అయితే, టీమిండియా యార్కర్ కింగ్ నటరాజన్ చివరి ఓవర్‌లో అద్భుతంగా బౌలింగ్ చేయడంతో భారత్ విజయతీరాలకు చేరింది. ఇన్నింగ్స్ 50వ ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి 14 పరుగులు అవసరం కాగా, యార్కర్ స్పెషలిస్ట్ నటరాజన్ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి భారత్ విజయాన్ని ఖాయం చేశాడు.
 
కాగా, తొలుత ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఫలితంగా భారత్ 48.2 ఓవర్లలో 329 పరుగులకే ఆలౌట్ అయింది. ఓ దశలో టీమిండియా దూకుడు చూస్తే 400 పరుగుల స్కోరు సాధ్యమేనని అనిపించింది. కానీ, కీలక సమయాల్లో వికెట్లు తీసిన ఇంగ్లండ్ బౌలర్లు ఆతిథ్య జట్టు జోరుకు బ్రేకులు వేశారు.
 
ఓపెనర్ శిఖర్ ధావన్ 56 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 67 రన్స్ చేయగా, రోహిత్ శర్మ 37 బంతుల్లో 37 రన్స్ చేసి తొలి వికెట్‌కు 103 పరుగులు జోడించి మంచి శుభారంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ (7), కేఎల్ రాహుల్ (7) విఫలమైనా రిషబ్ పంత్, హార్దిక్ పాండ్య జోడీ క్రీజులో ఉన్నంత సేపు విధ్వంసం సృష్టించింది. పంత్ 62 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులతో 78 పరుగులు చేయగా, హార్దిక్ పాండ్య 44 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులతో 64 పరుగులు సాధించాడు.
 
ఆ తర్వాత కృనాల్ పాండ్య (25), శార్దూల్ ఠాకూర్ (21 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 30 రన్స్) పోరాడడంతో భారత్ స్కోరు 300 మార్కు దాటింది. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ ఉడ్ 3, అదిల్ రషీద్ 2, శామ్ కరన్ 1, రీస్ టాప్లే 1, మొయిన్ అలీ 1, లివింగ్ స్టన్ 1 వికెట్ తీశారు. 
 
ఆ తర్వాత 330 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్... 50 ఓవర్లలో 9 వికెట్లకు 322 పరుగులు చేసి ఓటమిపాలైంది. వీరోచితంగా పోరాడిన శామ్ కరన్ 95 పరుగులతో నాటౌట్‌గా మిగిలాడు. అంతకుముందు డేవిడ్ మలాన్ (50), బెన్ స్టోక్స్ (35), లివింగ్ స్టన్ (36), మొయిన్ అలీ (29) రాణించారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 4, భువనేశ్వర్ కుమార్ 3, నటరాజన్ ఓ వికెట్ తీశారు.
 
ఈ మ్యాచ్ లో టీమిండియా ఫీల్డింగ్ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. నాలుగు క్యాచ్‌లు వదిలేసి మ్యాచ్‌ను చివరి ఓవర్ వరకు తీసుకొచ్చారు. కాగా, ఈ విజయంతో 3 వన్డేల సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. ఇప్పటికే టెస్టు, టీ20 సిరీస్‌లు భారత్ వశం కాగా, ఇంగ్లండ్ ఉత్త చేతులతో స్వదేశానికి పయనమవుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పూణె థర్డ్ వన్డే మ్యాచ్: 329 రన్స్‌కు భారత్ ఆలౌట్