Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ట్వంటీ20 మ్యాచ్ : గల్లీ స్థాయిలో భారత బౌలింగ్ ... పాక్ ఓపెనర్ల చెడుగుడు

ట్వంటీ20 మ్యాచ్ : గల్లీ స్థాయిలో భారత బౌలింగ్ ... పాక్ ఓపెనర్ల చెడుగుడు
, సోమవారం, 25 అక్టోబరు 2021 (06:55 IST)
దుబాయ్ వేదికగా జరిగిన ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీలో భారత క్రికెట్ జట్టు నిరాశాజనకంగా ఆరంభించింది. తొలి పోరు పాకిస్థాన్‌తో కావడంతో ఈ మ్యాచ్‌కు ఎక్కడలేని క్రేజ్‌ ఏర్పడింది. ఆ అంచనాలను కోహ్లీ సేన ఏమాత్రం అందుకోలేకపోయింది. 
 
అటు ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో ఎదురైన ఐదు ఓటములకు పాక్‌ 10 వికెట్ల తేడాతో గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. ఓపెనర్లు మహ్మద్‌ రిజ్వాన్‌ (55 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 79 నాటౌట్‌), బాబర్‌ ఆజమ్‌ (52 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 నాటౌట్‌) ఇద్దరే లక్ష్యాన్ని ఛేదించారు. 
 
ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 పరుగులు చేసింది. కోహ్లీ (49 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 57), పంత్‌ (30 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 39) మాత్రమే మెరుగ్గా రాణించారు. షహీన్‌కు మూడు, హసన్‌ అలీకి రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో పాక్‌ 17.5 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 152 పరుగులు చేసి గెలిచింది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా షహీన్‌ షా అఫ్రీది నిలిచాడు.
 
అయితే, ప్రపంచకప్ పోటీల్లో భారత్‌పై గెలవలేదన్న అప్రదిష్ఠను పాకిస్థాన్ ఒక్క దెబ్బతో చెరిపివేసింది. వరల్డ్ కప్ చరిత్రలో దాయాదిపై తొలి విజయాన్ని అందుకుంది. టీ20 వరల్డ్ కప్‌లో సూపర్-12 దశలో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో పాక్ 10 వికెట్ల తేడాతో అత్యంత ఘనవిజయం సాధించింది. 
 
పాక్ ఓపెనర్లు వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ మహ్మద్ రిజ్వాన్, కెప్టెన్ బాబర్ అజామ్‌ల జోడీని విడదీసేందుకు భారత బౌలర్లు విఫలయత్నాలు చేశారు. కానీ, వారు మాత్రం భారత బౌలింగ్‌ను గల్లీ స్థాయికి దిగజార్చి చెడుగుడు ఆడేసుకున్నాడు. 
 
ఇదిలావుంటే, వరల్డ్ కప్ చరిత్రలో పాకిస్థాన్‌పై భారత్‌కు ఇది అత్యంత ఘోర పరాజయం. ఈ రెండు జట్లు వరల్డ్ కప్‌లో తలపడటం ఇది 13వ సారి కాగా, గతంలో 12 పర్యాయాలు భారత జట్టే నెగ్గింది. కానీ, ఆ ఓటమి ఆనవాయితీని తిరగరాస్తూ పాకిస్థాన్ దుబాయ్‌లో అద్భుత విజయం సాధించింది.
 
నిజానికి ఈ టోర్నీకి ముందు దుబాయ్ వేదికగా ఐపీఎల్ 14వ సీజన్ రెండో సీజన్ పోటీలు జరిగాయి. ఈ ఐపీఎల్ అనుభవం భారత్‌కు ఏమాత్రం అక్కరకు రాలేదు. ధోనీ సలహాలు ఉపయోగపడలేదు. టాస్ ఓడిన క్షణం నుంచి టీమిండియాకు అన్నీ ఎదురుదెబ్బలే తగిలాయి.
 
బ్యాటింగ్ ఆరంభంలోనే ఓపెనర్లను చేజార్చుకోగా, భారీ స్కోరు సాధించాలన్న ఆశలకు అక్కడే గండిపడింది. తమకు సొంతగడ్డ వంటి దుబాయ్‌లో పాక్ ఆటగాళ్లు చిచ్చరిపిడుగుల్లా రెచ్చిపోయారు. ఫలితంగా అపూర్వమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. వరల్డ్ కప్ చరిత్రలో భారత్‌ను ఓడించగలమన్న ఆత్మవిశ్వాసాన్ని పొందారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ కప్ : పాకిస్థాన్ సూపర్ విజయం