Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐసీసీ టీ20 వరల్డ్ కప్.. విశ్వవిజేతగా కివీస్ మహిళా జట్టు..

new zealand women's team

ఠాగూర్

, సోమవారం, 21 అక్టోబరు 2024 (09:58 IST)
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీ విజేతగా న్యూజిలాండ్ జట్టు అవతరించింది. దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా మహిళా జట్టును చిత్తు చేసిన కివీస్ మహిళలు ప్రపంచ విజేతగా నిలిచారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు 158 పరుగులు చేసింది. ఆ తర్వాత 159 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ ఉమెన్స్... నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టానికి 126 పరుగులు మాత్రమే చేసి ఓటమిని మూటగట్టుకున్నారు. దీంతో 32 పరుగుల తేడాతో ప్రపంచ కప్‌ను సొంతం చేసుకున్నారు. 
 
కాగా, ఈ అంతిమ పోరులో కివీస్ జట్టు అన్ని విభాగాల్లోనూ రాణించారు. బ్యాటింగులో సుజీ బేట్స్ 32, అమేలియా 43, బ్రూకీ 38 పరుగులతో రాణించారు. దక్షిణాఫ్రికా ఉమెన్స్ బౌలర్లలో మాబా 2 వికెట్లు, ఖాకా, ట్రైయోన్, నదినే తలో వికెట్ చొప్పున తీశారు. ఇక లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్స్ 33 పరుగులు మినహా మిగతా వారెవరూ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు. 
 
ఇక కివీస్ బౌలర్లలో రోజ్మేరీ మెయిర్, అమేలియా చెరో మూడు వికెట్లతో అదరగొట్టారు. ఈడెన్ కార్సన్, ఫ్రాన్ జోనాస్, బ్రూకీ తలో వికెట్ తీసి.. కీలక పాత్ర పోషించారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించిన అమేలియాకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.
 
కాగా ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌ను న్యూజిలాండ్ గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే ప్రపంచ కప్ ఆరంభానికి ముందు ఆ జట్టు పేలవ ప్రదర్శన చేసింది. వరుసగా 10 పరాజయాలను మూటగట్టుకుంది. 2022 నుంచి వరల్డ్ కప్ ప్రారంభం వరకు కేవలం 3 మ్యాచ్ మాత్రమే విజయాలు సాధించింది. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ మెగా టోర్నీలో రాణించారు. ప్రారంభ మ్యాచ్‌లో భారత మహిళా జట్టును ఓడించారు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ మినహా మిగతా అన్ని మ్యాచ్‌లలో న్యూజిలాండ్ మహిళా క్రికెటర్లు అద్భుతంగా రాణించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చాంపియన్స్ ట్రోఫీ టీమిండియా డుమ్మా? దిక్కుతోచనిస్థితిలో పీసీబీ!!