ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్లో భారత బౌలర్ అశ్వినీ కుమార్ చరిత్ర సృష్టించాడు. తొలి మ్యాచ్లో నాలుగు ఓవర్ల పాటు బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు తీశాడు. పైగా, ఐపీఎల్లో తాను బౌల్ చేసిన తొలి బంతికే వికెట్ పడగొట్టి మరో రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా, సోమవారం రాత్రి కోల్కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్తో ఐపీఎల్లో అశ్వనీ కుమార్ అడుగుపెట్టాడు.
ఐపీఎల్ కెరియర్లోనే తొలి బంతికే రహానే వికెట్ తీశాడు. ఆ తర్వాత ఓవర్లో రింకూ సింగ్, ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన మనీశ్ పాండేను పెవిలియన్కు చేర్చాడు. అలాగే, హార్డ్ హిట్టర్ అండ్రీ రస్సెల్ను తన మ్యాజిక్ బంతితో క్లీన్బౌల్డ్ చేశాడు. ఇలా తాను ఆడిన ఐపీఎల్ తొలి మ్యాచ్లోనే నాలుగు వికెట్లు పడగొట్టిన భారత బౌలర్గా రికార్డు సృష్టించడంతో పాటు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.
కాగా, 23 యేళ్ల అశ్వనీ కుమార్ మొహాలీలో జన్మించాడు. డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడంలో స్పెషలిస్ట్. గత యేడాది జరిగిన షేర్ ఏ పంజాబ్ టీ20లో అద్భుతంగా రాణించి, ముంబై మేనేజ్మెంట్ దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్ మెగా వేలంలో అశ్వీనీ కుమార్ను ముంబై జట్టు రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. గత సీజన్లో పంజాబ్ కింగ్స్ జట్టులో ఉన్నప్పటికీ ఒక్క మ్యాచ్లో కూడా ఆడే అవకాశం రాలేదు.