Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ కప్.. సమఉజ్జీల పోరులో గెలుపెవరిదో?

వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ కప్.. సమఉజ్జీల పోరులో గెలుపెవరిదో?
, శుక్రవారం, 18 జూన్ 2021 (09:31 IST)
ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ టైటిల్ ఫైనల్ పోరు శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది. ఈ పోటీలో సమ ఉజ్జీలుగా ఉన్న భారత, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. మరికొన్ని గంటల్లో ఈ టైటిల్ పోరు సాగనుంది. ఈ పోరులో తొలి కప్‌ను సాధించేందుకు కోహ్లీ, విలియమ్సన్‌ జట్లూ తహతహలాడుతున్నాయి. 
 
భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య శుక్రవారం నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్‌ సౌథాంప్టన్‌ వేదికగా ప్రారంభం కానుంది. ఇరు జట్లు సమఉజ్జీలుగానే కనిపిస్తున్నా.. చివరికి విజయం ఎవరిని వరిస్తుందోనని క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
 
ఎంఎస్‌ ధోనీ సరసన చేరేందుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆశపడుతుండగా.. తన హయాంలోనైనా తొలి ఐసీసీ ట్రోఫీని బహుమతిగా ఇవ్వాలని కేన్ విలియమ్సన్ ఆరాటపడుతున్నారు. ఫైనల్ సమరానికి ముందు ఇంగ్లండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను 1-0తో గెలిచిన కేన్ సేన సగర్వంగా బరిలోకి దిగనుంది. మరోవైపు కేవలం ప్రాక్టీస్ మ్యాచ్‌లతోనే ఆత్మస్థైర్యం మూటకట్టుకున్న విరాట్ సేన మైదానంలో అడుగుపెట్టబోతోంది. అయితే, విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే. 
 
గత రెండేళ్లుగా కొనసాగుతున్న డబ్ల్యూటీసీ.. ఎట్టకేలకు చివరి అంకానికి చేరువైంది. కరోనా మహమ్మారితో కొన్ని దేశాల మధ్య మ్యాచ్‌లు జరగలేదు. దీంతో విజయాల శాతం ఆధారంగా ఐసీసీ భారత్, న్యూజిలాండ్‌ టీంలను ఫైనల్‌‌లో చేర్చింది. ఈ ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 144 ఏళ్ల చరిత్ర కలిగిన టెస్టు క్రికెట్‌ను సరికొత్తగా ఆవిష్కరిచనుందనడంలో సందేహం లేదు.
 
మరోవైపు, ఐసీసీ ప్రవేశపెట్టిన అన్ని టోర్నీల ట్రోఫీలను భారత్ కైవసం చేసుకుంది. వన్డే, టీ20 ప్రపంచకప్‌లు, ఛాంపియన్స్‌ ట్రోఫీ టైటిళ్లను గెలుచుకుని ఐసీసీ ట్రోఫీల్లో తన సత్తా చాటింది. టీమిండియాకు టెస్టుల్లో ఎక్కువ విజయాలను అందించిన కెప్టెన్లలో విరాట్‌ కోహ్లీ ముందున్నాడు. కెప్టెన్సీతోనే కాదు.. ఆటలోనూ విరాట్ దూకుడు తగ్గలేదు. 
 
అయితే, విరాట్ హయాంలో వన్డే ప్రపంచకప్‌, ఛాంపియన్స్‌ట్రోఫీ టైటిళ్లు దక్కలేదు. ఈ ఛాంపియన్‌షిప్‌ ట్రోఫీని అందుకుని ఆ కొరత తీర్చుకోవాలని ఎదురుచూస్తున్నాడు. క్యూరేటర్ సిమన్ లీ అంచనాల మేరకు.. ఈ పిచ్‌ పేసర్లకు, స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందని అన్నాడు. దీంతో ఇండియా టీం ముగ్గురు పేసర్లను బరిలోకి దించనుందని తెలుస్తోంది. అలాగే స్పిన్నర్లను కూడా అదే సంఖ్యలో తీసుకుంటుందని టాక్ వినిపిస్తోంది.
 
మరోవైపు, ఇరు జట్లూ ఇప్పటివరకు 59 సార్లు టెస్టుల్లో తలపడ్డాయి. అయితే టీమిండియా 21 విజయాలతో ముందజంలో ఉంది. ఇక న్యూజిలాండ్ టీం 12 విజయాలను సాధించింది. మిగతా మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.
 
ఇక ఐసీసీ ఈవెంట్లతో ఇండియా, న్యూజిలాండ్ టీంలు 5 సార్లు తలపడ్డాయి. అయితే ఈ ఐదుసార్లు టీమిండియా ఓటమిపాలైంది. దీంతో ఐసీసీ ఈవెంట్లలో న్యూజిలాండ్‌తే పైచేయిగా ఉంటోంది.
 
ఇరు జట్ల వివరాలు... 
 
భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్‌ గిల్, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), అజింక్యా రహానె, రిషబ్ పంత్ (కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఇశాంత్ శర్మ, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా
 
న్యూజిలాండ్‌: డెవాన్ కాన్వే, టామ్ లాథమ్, కేన్ విలియమ్సన్ (కెప్టెన్‌), రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, బిజె వాట్లింగ్ (కీపర్), కోలిన్ డి గ్రాండ్‌హోమ్, కైల్ జామిసన్, టిమ్ సౌతీ, నీల్ వాగ్నెర్ / అజాజ్ పటేల్, ట్రెంట్ బౌల్ట్. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

WTC Final.. ప్లేయింగ్ ఎలెవన్ ప్రకటన_All The Best టీమిండియా