Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేడు భారత్ - బంగ్లా తొలి ట్వంటీ20 మ్యాచ్ .. కుర్రాళ్ళకు ఛాన్స్

నేడు భారత్ - బంగ్లా తొలి ట్వంటీ20 మ్యాచ్ .. కుర్రాళ్ళకు ఛాన్స్
, ఆదివారం, 3 నవంబరు 2019 (13:13 IST)
వచ్చే యేడాది జరుగనున్న పొట్టి ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా భారత క్రికెట్ జట్టు సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ (ఫిరోజ్ షా కోట్లా) స్టేడియంలో ఇరుజట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. 
 
ఇటీవల సంప్రదాయ క్రికెట్‌లో దక్షిణాఫ్రికాను దంచికొట్టిన భారత్.. ఇప్పుడు చిన్న ఫార్మాట్‌లో చెలరేగేందుకు రెడీ అయింది. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకోగా.. అతడి స్థానంలో ఓపెనర్ రోహిత్ శర్మ జట్టును నడిపించనున్నాడు. 
 
అయితే గత కొన్ని రోజులుగా మైదానం బయటి విషయాలతో బాగా వార్తల్లోకెక్కిన ఈ సిరీస్ తొలి మ్యాచ్‌లోనే గెలిచి బోణీ కొట్టాలని భారత్ చూస్తుంటే.. ఇప్పటివరకు ఈ ఫార్మాట్‌లో భారత్‌పై గెలుపు రుచి చూడని బంగ్లా పులులు ఈ సారి ఆ కోరిక తీర్చుకోవాలని కసిమీద ఉన్నారు. 
 
తాజాగా బంగ్లాతో సిరీస్‌కు విరాట్ దూరం కావడంతో కుర్రాళ్లు తమను తాము నిరూపించుకునేందుకు ఇది చక్కటి అవకాశంగా చెప్పొచ్చు. రెగ్యులర్ కెప్టెన్ గైర్హాజరీలో తాత్కాలిక సారథి రోహిత్, మరో ఓపెనర్ శిఖర్ ధవన్ బ్యాటింగ్ భారాన్ని మోయనున్నారు. 
 
టెస్టుల్లో ఓపెనర్‌గా ఆడిన తొలి సిరీస్‌లోనే పరుగుల వరద పారించిన రోహిత్ సూపర్ ఫామ్‌లో ఉండటం మన జట్టుకు కలిసొచ్చే అంశం. వన్‌డౌన్‌లో లోకేశ్ రాహుల్‌కు చాన్సిస్తారా.. లేక నాలుగేండ్ల తర్వాత టీమ్‌ఇండియాకు ఎంపికైన వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్ వైపు మొగ్గు చూపుతారా అనేది తేలాల్సి ఉంది.
 
మరోవైపు, సిరీస్ ప్రారంభానికి ముందే బంగ్లాకు చాలా ఎదురుదెబ్బలు తగిలాయి. టూర్ ప్రారంభానికి ముందు ఆటగాళ్ల సమ్మె.. తమీమ్ ఇక్బాల్, సైఫుద్దీన్ సిరీస్‌కు దూరం కావడంతో బంగ్లాదేశ్ జట్టు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా బుకీలు సంప్రదించిన విషయాన్ని ఐసీసీ అవినీతి నిరోధక విభాగానికి తెలియజేయనందుకు కెప్టెన్ షకీబ్‌పై ఐసీసీ వేటు వేయడం బంగ్లాను మరిన్ని కష్టాల్లోకి నెట్టింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మహ్ముదుల్లా రియాద్ జట్టును ఎలా నడిపిస్తాడనేది కీలకంగా మారింది.  
 
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), ధావన్, కేఎల్ రాహుల్ లేదా శాంసన్, శ్రేయాస్, పంత్, శివమ్ దూబే, కృనాల్, సుందర్, చాహల్, దీపక్ చాహర్, ఖలీల్ లేదా శార్దూల్.
 
బంగ్లాదేశ్: మహ్ముదుల్లా (కెప్టెన్), లిటన్, సౌమ్య, మిథున్ లేదా నయీమ్, ముష్ఫికర్, మొసద్దిక్, అఫిఫ్, అరాఫత్, ముస్తఫిజుర్, అమీన్, తైజుల్.
 
పిచ్, వాతావరణం
దీపావళి అనంతరం దేశ రాజధానిలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. ఆదివారం కూడా పరిస్థితుల్లో మార్పు ఉండకపోవచ్చు. ఇక్కడ జరిగిన చివరి మ్యాచ్‌లో వికెట్ స్పిన్నర్లకు సహకరించింది. పిచ్‌ను పరిశీలించిన బంగ్లా కెప్టెన్ మహ్ముదుల్లా బ్యాటింగ్‌కు అనుకూలించేలా కనిపిస్తుందని అభిప్రాయపడ్డాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

21 మందితో క్రికెట్ ఆడేవాడిని: షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు