Publish Date: Fri, 25 Dec 2020 (10:16 IST)
Updated Date: Fri, 25 Dec 2020 (10:24 IST)
యూకేలో విజృంభిస్తున్న కొత్తరకం కరోనా వైరస్.. ప్రపంచాన్ని మరింత కలవరానికి గురిచేస్తోంది. కొత్తరకం స్ట్రెయిన్ వ్యాప్తితో కోవిడ్-19కు టీకా వచ్చిందనే ఆనందం ఆవిరవుతోంది.
ఏడాదిగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రపంచ దేశాలు.. ఇప్పుడిప్పుడే కుదటపడుతుండగా మహమ్మారి కొత్తరూపం సంతరించుకోవడం ఆందోళన చెందుతున్నారు.
ఇంకా ఎటువంటి ఉపద్రవం ముంచుకొస్తుందోనని బిక్కుబిక్కుమంటోంది. ప్రస్తుత కోవిడ్ లక్షణాలతోపాటు అదనంగా మరో ఏడు లక్షణాలు కొత్తరకం స్ట్రెయిన్ సోకినవారికి ఉంటాయని నేషనల్ హెల్త్ సర్వీసెస్ తెలిపింది.
అలసట, ఆకలి మందగించడం, తలనొప్పి, విరేచనాలు (డయోరియా), మానసిక గందరగోళం, కండరాల నొప్పులు దీనికి సంకేతమని పేర్కొన్నారు. మరోవైపు, నైజీరియాలోనూ మరో కొత్తరకం కరోనాను గుర్తించారు. ఈ విషయాన్ని ఆఫ్రికా అంటువ్యాధుల నియంత్రణ విభాగం ప్రకటించింది.
నైజీరియాలో గుర్తించిన కొత్తరకం స్ట్రెయిన్.. బ్రిటన్, దక్షిణాఫ్రికాలలో జాతికి భిన్నమైందని ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) డైరెక్టర్ జాన్ కెంగ్సాంగ్ పేర్కొన్నారు.
నైజీరియాలో గుర్తించి జన్యువు ఇంకా చాలా పరిమిత డేటాపై ఆధారపడి ఉందని, ఇది 501 మ్యుటేషన్ చెందిన రకమని ఆయన వ్యాఖ్యానించారు. డిసెంబరు 18న దక్షిణాఫ్రికాలో గుర్తించిన స్ట్రెయిన్ 501.వీ2గా పేర్కొన్నారు.