Publish Date: Mon, 21 Dec 2015 (11:56 IST)
Updated Date: Thu, 24 Dec 2015 (22:25 IST)
క్రైస్తవులకు అతి పవిత్రమైన పండుగ క్రిస్మస్. యేసుక్రీస్తు జన్మదిన సందర్భంగా జరుపుకునే ఈ పండుగ ఎంతో పవిత్రమైనది. యేసు జన్మించి ఇప్పటికి రెండు వేల సంవత్సరాలు దాటిపోయినా ఆయనను కరుణారసమూర్తిగా దయామూర్తిగా నిత్యమూ ప్రార్థిస్తూనే ఉన్నారు.
క్రిస్మస్ వస్తోందంటే సందడి మొదలవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న చర్చిలన్నీ కళకళలాడుతాయి. దైవ ప్రార్థన చేయడానికి వేల మంది చర్చిలకు వెళ్తుంటారు. కోరికలు నెరవేరాలని నిండు మనస్సుతో దేవుడిని ప్రార్థిస్తారు. కొన్నిసార్లు మన కోరికలు ఫలిస్తాయి. కొన్నిసార్లు నెరవేరవు. అప్పుడు కోరికలు ఎందుకు నేరవేరటం లేదనే ప్రశ్నమదిలో తలెత్తుతుంది.
ప్రార్థన ఎందుకు ఫలించదు?
గర్వం, అతిశయం, అత్యంత ప్రమాదరకరమైన అంశాలు. చేసిన దానధర్మాలు, సాయాలను గుర్తు చేస్తూ మేలు జరపమని కోరే ప్రార్థనలకు ఫలితం ఉండదు. అలాగే, భక్తి లేనిచోట ప్రార్థన ఫలించదు. బూటకపు భక్తి వలన ప్రయోజనం ఉండదు. ఇతరుల నాశనం కోరే ప్రార్థన ఫలించదు. పగకు, ప్రేమకు మధ్య పొసగదు.
స్వార్థపూరిత ప్రార్థన వల్ల ప్రయోజనం ఉండదు. నాకు నా కుటుంబానికి మాత్రమే మంచి జరగాలనే ప్రార్థన ఫలించదు. నిండు మనస్సుతో పరుల మంచి కోసం ప్రార్థించాలి. మన జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశంగా దేవుడిని గుర్తించి ఆయనపై విశ్వాసం ఉంచి ప్రార్థిస్తే మాత్రమే ఫలితం ఉంటుంది. "నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పరిపూర్ణ హృదయంపై నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు నీ త్రోవలు సరళము చేయును".