* పరీక్షలంటే అనవసరమైన భయాలను పెంచుకుని ఒత్తిడికి లోనైతే అది చెడే తప్ప మంచి చేయదు. కాబట్టి పకడ్బందీగా సబ్జెక్ట్ రివిజన్స్ ప్లాన్ చేసుకుని తూ.చ. తప్పకుండా పాటించాలి. ఇలా చేయటంవల్ల పరీక్షల సమయంలో మెదడు ప్రశాంతంగా ఉండి, చదివినవి గుర్తుండటమేగాకుండా, చక్కగా రాసి, మంచి మార్కులను స్కోరు చేయవచ్చు.
* పరీక్షల సిలబస్ కరెక్టుగా తెలుసుకోవాలి. ఏవైనా మిస్సయిన పాఠాలు ఉన్నట్లయితే వాటిని పూర్తి చేసుకోవాలి. నోట్స్ అన్నీ పూర్తి చేయాలి. ప్రశ్నా పత్రం ఫార్మాట్ ఎలా ఉంటుందో ముందుగానే తెలుసుకోవాలి. దానికి అనుగుణంగానే ప్రిపేర్ అవ్వాలి. రివిజన్ చేసుకునేందుకు, చదువుకునేందుకు ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూడాలి. ఇంట్లో అది కుదరకపోతే లైబ్రరీకో, స్నేహితుల ఇళ్లకో వెళ్లి చదువుకోవాలి.
* అలాగే ఇంట్లో చదువుకునేందుకు ప్రత్యేకంగా ఓ స్థలం కేటాయించమని తల్లిదండ్రులను అడగాలి. అక్కడ పడుకోవటం లేదా తినటం లాంటివి చేయకుండా ఉండాలి. కేవలం చదువుకునేటప్పుడు మాత్రమే ఆ స్థలాన్ని ఉపయోగించుకోవాలి. పైన చెప్పుకున్న వాటిని పాటించినట్లయితే పరీక్షలప్పుడు గాబరా దూరమై ప్రశాంతంగా రాయగలుగుతారు.