Publish Date: Thu, 11 Dec 2014 (18:23 IST)
Updated Date: Thu, 11 Dec 2014 (18:27 IST)
నిత్యం ఫోన్లలో మాట్లాడుతూ.. కంప్యూటర్లతో కాలం గడుపుతూ, టీవీలకు అతుక్కుపోయే పిల్లలతో పోలిస్తే వాటికి దూరంగా ఉండే చిన్నారులు తోటి మనుషుల బాధలను, సంతోషాలను చక్కగా అర్థం చేసుకుంటారు. తద్వారా వారితో చక్కని అనుబంధాన్ని ఏర్పరుచుకుంటారు.
చిన్నపాటి కష్టాలకి కుంగిపోకుండా సామాజిక మద్దతుతో స్వతంత్రంగా అడుగులేస్తారు. అందుచేత గృహిణిలైనా, ఉద్యోగినులైనా పిల్లల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపండి. పిల్లలను కంప్యూటర్లకే అంకితం చేయకుండా వారి ఆలోచనలను డైవర్ట్ చేయండి. బయట ప్రపంచం ఎలా ఉందో తెలియజేయండి. వారికి సపోర్ట్గా ఉండండి అంటున్నారు మానసిక నిపుణులు. యంత్రాలతోనే పిల్లలు సర్దుకుపోతే.. మానవ విలువలు మెల్లమెల్లగా కుంచించుకుపోతాయని వారు చెబుతున్నారు.
రోజులో పిల్లలు స్క్రీన్ టైమ్ అంటే ఎలక్ట్రానిక్ వస్తువుల తెరలు చూడటానికి ఎంత కేటాయించవచ్చంటే.. మూడు నుంచి 18 ఏళ్ల పిల్లలకు రెండు గంటలకు మించి చూడకూడదు. రెండేళ్ల లోపు చిన్నారులకు అసలు ఎలక్ట్రానిక్ తెరలను చూపించకపోవడమే మేలు.
అయితే తాజా అధ్యయనంలో ప్రపంచవ్యాప్తంగా 8ఏళ్ల లోపు పిల్లలు రెండు గంటలకు తక్కువ కాకుండా టీవీ చూస్తున్నారట. అలాగని అసలు చూడ్డమే తప్పని కాదు. తగిన సమయం కేటాయిస్తే పిల్లల తెలివి తేటలు పెరుగుతాయి. అతిగా టీవీ చూడటం పిల్లల్లో ఊబకాయం, నిద్రలేమి, సామాజిక, వ్యక్తిగత ప్రవర్తనలో మార్పుల్ని తలెత్తుతాయి.