తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లా కుంభకోణంలో ఒక అమానవీయ సంఘటన జరిగింది. స్థానక ప్రభుత్వ మహిళా కాలేజీ మరుగుదొడ్డిలో ఓ విద్యార్థిని ప్రసవించింది. యూట్యూబ్లో చూసి బొడ్డు కత్తిరించింది. ఆ తర్వాత పసికందును చెత్తబుట్టలోపడేసి, ఏమీ తెలియనట్టుగా తరగతి గదిలో వచ్చి కూర్చొంది. అయితే, క్లాస్ రూమ్లో ఆ విద్యార్థికి రక్తస్రావం కావడంతో ఈ విషయం బయటపడింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
కుంభకోణంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో 4 వేల మందికిపైగా విద్యార్థినులు చదువుతున్నారు. ఇదిలావుండగా 20 ఏళ్ల విద్యార్థిని గర్భం దాల్చింది. విషయం ఎవరికి తెలియకుండా జాగ్రత్తపడింది. శుక్రవారం తరగతి గదిలో ఉండగా ప్రసవ నొప్పులు రావడంతో వెంటనే మరుగుదొడ్డికి వెళ్లి ఆడ శిశువుని ప్రసవించింది. అనంతరం యూట్యూబ్ వీడియో చూసి బొడ్డుకోసింది.
అనంతరం బిడ్డను కళాశాలలోని చెత్త కుండీలో పడేసి చెత్తతో కప్పేసింది. తర్వాత ఏం జరగనట్లు వెళ్లి తరగతి గదిలో కూర్చుంది. రక్తస్రావాన్ని గుర్తించిన తోటి విద్యార్థినులు అధ్యాపకులకు తెలిపారు. దీంతో వారు 108 అంబులెన్స్ని పిలిపించి కుంభకోణం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అక్కడ వైద్యులు ఆమెను విచారించి మళ్లీ కళాశాలకు అంబులెన్స్ను పంపి శిశువును తీసుకొచ్చేలా చేశారు. బిడ్డకు వెంటనే చికిత్స అందించి బతికించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఘటనపై నాచ్చియార్ కోయిల్ మహిళా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.