Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రెండు దశాబ్దాల తర్వాత ఎన్నికల్లో పోటీకి దూరంగా కేసీఆర్ ఫ్యామిలీ!

kcrao

వరుణ్

, శుక్రవారం, 26 ఏప్రియల్ 2024 (10:54 IST)
తెలంగాణ రాష్ట్ర సాధకుల్లో ఒకరు, మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు కుటుంబం రెండు దశాబ్దాల తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లో దూరంగా ఉంది. 2001లో భారాస (అప్పటి తెలంగాణ రాష్ట్ర సమిమి) ఆవిర్భావం తర్వాత తొలిసారిగా కేసీఆర్‌ కుటుంబం నుంచి ఎవరూ లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగడం లేదు. పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో (2004లో) కేసీఆర్‌ సిద్దిపేట అసెంబ్లీ, కరీంనగర్‌ లోక్‌సభ స్థానాలకు పోటీచేసి.. రెండుచోట్లా విజయం సాధించారు. 
 
అనంతరం సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో అక్కడి నుంచి హరీశ్‌ రావు గెలుపొందారు. కేంద్రంలో అప్పటి యూపీఏ ప్రభుత్వంలో నాటి ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ మంత్రివర్గంలో కేసీఆర్‌ మంత్రిగా కొనసాగారు. తదనంతర పరిణామాలు.. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో గులాబీ సారథి 2006, 2008 సంవత్సరాల్లో రెండుసార్లు రాజీనామా చేసి కరీంనగర్‌ నుంచి విజయం సాధించారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్‌ మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి గెలుపొందారు. 
 
ఇక్కడ ఆయన ఎంపీగా ఉన్నప్పుడే 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాకారమైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం జరిగిన ఎన్నికల్లో (2014లో) గజ్వేల్‌ నుంచి అసెంబ్లీకి, మెదక్‌ నుంచి పార్లమెంటుకు కేసీఆర్‌ పోటీచేసి రెండింటా గెలుపు సొంతం చేసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత మెదక్‌ ఎంపీ పదవికి భారాస అధినేత రాజీనామా చేయడంతో ఆ స్థానం నుంచి కొత్త ప్రభాకర్‌రెడ్డి ఎంపీగా గెలుపొందారు. ఇవే ఎన్నికల్లో కేసీఆర్‌ కుమార్తె కవిత కూడా నిజామాబాద్‌ ఎంపీగా విజయం సాధించారు.
 
2019 లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్‌ ఎంపీగా పోటీ చేయకపోయినా.. కవిత మాత్రం నిజామాబాద్‌ స్థానం నుంచి బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. 2022లో తెరాసను భారాసగా మార్చిన కేసీఆర్‌.. జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భారాస ఓటమి పాలై, ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. దీంతో 2024 లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్‌ కుటుంబం నుంచి ఎవరు పోటీలో నిలుస్తారనే ఆసక్తి తొలినాళ్లలో నెలకొంది. 
 
నిజామాబాద్‌ నుంచి తిరిగి కవితను పోటీ చేయించడం లేదనే సంకేతాలను పార్టీ ముందునుంచే ఇస్తూ వచ్చింది. మెదక్‌ నుంచి కేసీఆర్‌ ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం జరిగినా.. ఈసారి అక్కడి నుంచి వెంకట్రామి రెడ్డికి టికెట్‌ ఖరారు చేశారు. ఒక దశలో మల్కాజిగిరి నుంచి కేటీఆర్‌ను ఎంపీ అభ్యర్థిగా పోటీలో నిలపాలని పార్టీ చర్చించినట్లు ప్రచారం జరిగింది. అయితే ఎంపీగా పోటీ చేయడానికి కేటీఆర్‌ అంతగా ఆసక్తి చూపకపోవడంతో మరో అభ్యర్థి వైపు దృష్టి సారించిన అధిష్టానం చివరకు ఇక్కడి నుంచి రాగిడి లక్ష్మారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. మొత్తంగా పార్టీ ఆవిర్భవించిన 23 ఏళ్ల తర్వాత కేసీఆర్‌ కుటుంబం లోక్‌సభ ఎన్నికల్లో మొదటిసారిగా పోటీకి దూరంగా ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తితిదే మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులకు నోటీసులు పంపండి : హైకోర్టు ఆదేశం