తనకు పెళ్లి చేయట్లేదనే కోపంతో ఓ క్యాబ్ డ్రైవర్ కన్నతల్లినే పొట్టనబెట్టుకున్న ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో చోటుచేసుకుంది. కాళ్లకు ఏర్పడిన అనారోగ్యం కారణంతో ఆ తల్లి క్యాబ్ డ్రైవర్ అయిన తన కుమారుడికి పెళ్ళి చేయలేకపోయింది. అమ్మాయిని చూడలేకపోయింది. కానీ తరచూ ఆ క్యాబ్ డ్రైవర్ తల్లితో గొడవకు దిగేవాడు. అయితే ఆదివారం రాత్రి ఫుల్గా తాగొచ్చిన క్యాబ్ డ్రైవర్ తల్లిని సజీవంగా దహనం చేశాడని పోలీసులు వెల్లడించారు.
వివరాల్లోకి వెళితే.. అమర్ నాథ్ (40) ఓ క్యాబ్ డ్రైవర్. అతని తల్లి పేరు శశికళ. క్యాబ్ డ్రైవర్ అయిన అమర్నాథ్ ఆదివారం రాత్రి బాగా తప్పతాగి ఇంటికొచ్చాడు. తల్లితో గొడవపడ్డాడు. అలా గొడవ పెద్దది కావడంతో తల్లిని బలవంతంగా కుర్చీకి కట్టేసి కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో శశికళ తీవ్రగాయాలకు గురై మృతి చెందింది.
కాలికి ఏర్పడిన అనారోగ్యం కారణంగా కదల్లేని స్థితిలో ఉన్న ఆమెను అరుపులు కేకలు విన్న స్థానికులు కాపాడి ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాలతో శశికళ చికిత్స ఫలించక ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని అమర్నాథ్ను అరెస్ట్ చేశారు.