దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ సంస్థగా గుర్తింపు పొందిన భారతీయ స్టేట్ బ్యాంకు దాని అనుబంధ బ్యాంకుల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు సమాయత్తమైంది. ఇందుకోసం మొత్తం 6,100 క్లరికల్ పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఎస్బీఐ అనుబంధ శాఖల్లో ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఖాళీలు 1246 ఉన్నాయి. వీటిలో ఎస్సీలకు 196, ఎస్టీలకు 87, ఓబీసీలకు 336, జనరల్ కేటిగిరీకి 625 చొప్పున కేటాయించారు. ఈ పోస్టులకు ఎంపికయ్యే వారికి వేతన శ్రేణి రూ.7200 నుంచి 19300 చొప్పున చెల్లిస్తారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీస విద్యార్హత 60 శాతం మార్కలతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు మాత్రం 55 శాతం మార్కులతో పాసైతే సరిపోతుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 2010 అక్టోబర్ ఒకటో తేదీ నాటికి 18 నుంచి 28 ఏళ్లు (ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల గరిష్ట వయో సడలింపు) మించకూడదు.
ఈ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా కూడా చేసుకోవచ్చు. మిగిలిన వివరాల కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎస్బిఐ.సీఓ.ఐఎన్ అనే వెబ్సైటులో తెలుసుకోవచ్చు.