బ్యాంకింగ్ రంగంపై ఆసక్తి చూపే అభ్యర్థులకు శుభసమయం రానుంది. రానున్నమూడేళ్ళలో ప్రభుత్వ రంగ (పిఎస్యూ) బ్యాంకులు కొత్తగా 85 వేల ఉద్యోగాలు ఇవ్వనున్నాయి. వీరిలో 34,000 మందిని ఆఫీసర్ కేడర్లోనూ, 51,000 మందిని క్లరికల్ కేడర్లోనూ బ్యాంకులు నియమించుకోనున్నాయి. 2013 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
బ్యాంకులలో ఏర్పడిన ఉద్యోగ కొరతను పూర్తిగా అధిగమించే దిశగా పిఎస్యు బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయని న్యూడిల్లీలో జరిగిన ఎకనామిక్ ఎడిటర్స్ కాన్ఫరెన్స్ కోసం రూపొందించిన పత్రంలో కేంద్ర ఆర్థిక శాఖ ఈ విషయాలను వెల్లడించింది. ఈ నియామకాల ప్రక్రియ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబిపిఎస్) ఆధ్వర్యంలో జరుగుతుంది.
ఈ నియామకాలు పారదర్శకంగానూ.. వేగవంతంగానూ.. కొనసాగుతుందని ఐబిపిఎస్ తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో జరిగే కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్స్ అన్నంటినీ ఐబిపిఎస్ నిర్వహిస్తుందని తెలిపింది. గత సంవత్సరం ఐబిపిఎస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 125 సెంటర్లలో 60 లక్షల మందికి పరీక్షలు నిర్వహించింది.