ప్రముఖ అంతర్జాల (ఇంటర్నెట్) దిగ్గజం గూగుల్ హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించనుంది. రాష్ట్ర రాజధానిలో గూగుల్ రీసెర్చ్ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు గూగుల్ వెల్లడించింది.
క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో అతిపెద్ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నట్లు గూగుల్ తెలిపింది. ఇందుకు గానూ భారత్ నుంచి 300 మంది ఇంజనీర్లను నియంమించనున్నట్లు కంపెనీ తెలిపింది.
క్లౌడ్ కంప్యూటింగ్పై హైదరాబాద్, బెంగళూర్లలో 300 మంది నిపుణులు పనిచేస్తున్నారని, కాగా.. నూతనంగా ప్రారంభించనున్న ఈ రీసెర్చ్ సెంటర్కు అదనంగా మరో 300 మందిని నియమించనున్నట్లు గూగుల్ ఇండియా హెడ్ (ఇంజనీరింగ్) పీయుష్ రంజన్ వివరించారు.
ప్రస్తుతం కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలో సంస్థ సిసి కేంద్రం ఉందని, దానికన్నా పెద్ద సెంటర్గా హైదరాబాద్ కేంద్రాన్ని తీర్చిదిద్దనున్నామని ఆయన చెప్పారు.
గూగుల్ ఉద్యోగుల వేతనాల పెంపు:
ఇదిలా ఉండగా.. గూగుల్కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని కార్యాలయాల్లో పనిచేస్తున్న తమ ఉద్యోగులకు జనవరి నుంచి జీతాలను పెంచనున్నట్లు కంపెనీ తెలిపింది. తమ ఉద్యోగులకు కనీసం 10 శాతం చొప్పున వేతనాలను పెంచనున్నట్టు సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎరిక్ స్కిమిడ్త్ 23 వేల మంది ఉద్యోగులకు ఇ-మెయిల్స్ పంపారు. అంతే కాకుండా.. సిలికాన్ వ్యాలీ కార్యాలయంలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని అదనంగా 1000 డాలర్ల బోనస్ ఇవ్వనున్నట్టు వాల్స్ట్రీట్ జర్నల్ పత్రిక పేర్కొంది.