రాష్ట్ర రాజధానిలో జాబ్మేళా జరుగనుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ గవర్నెన్స్ (ఐఈజీ), జవహర్ నాలెడ్జ్ సెంటర్ (జేకేసీ)ల ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ‘జాబ్ ఫెయిర్’ జరుగుతుంది. ఇందుకోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఈ జాబ్ ఫెయిర్ మూడు దశలుగా జరుగుతుంది. ఈ నెల 17వ తేది, 21, డిసెంబర్ ఒకటో తేదీల్లో సికింద్రాబాద్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాల (ఉస్మానియా విశ్వవిద్యాలయం)లో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగనుంది.
ఈ జాబ్ ఫెయిర్లో మీడియా, రిటెయిల్, సేల్స్, మార్కెటింగ్, బ్యాంకింగ్, ఐటీ, విద్య, టెలికాం తదితర రంగాలకు చెందిన సత్యం, విప్రో, సదర్లాండ్, సీటెల్, 24/7 కస్టమర్, టాటా బిజినెస్ సపోర్ట్, టీఎంఐ నెట్వర్క్స్, చోళమండలం, డిజిటల్ నిర్వాణలకు సంబంధించి సుమారు 500 స్వదేశీ, అంతర్జాతీయ సాఫ్ట్వేర్ కంపెనీలు పాల్గొంటాయి. ఈ విషయాన్ని జాబ్ఫెయిర్ నిర్వాహకులు ఐఈజీ డైరెక్టర్ డాక్టర్ పి.మాధవ్ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.