నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు వివిధ విభాగాలలో దాదాపు 3,224 మందిని కొత్తగా నియమించనున్నట్లు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం బుధవారం తెలిపింది.
తమ ప్రభుత్వం వివిధ విభాగాలలో నూతన ఉద్యోగావకాశాలు కల్పించనున్నామని, దీంతో నిరుద్యోగులకు కాస్త ఊరట కలుగుతుందని పశ్చిమ బెంగాల్ ఆర్థిక శాఖామంత్రి అసిమ్ దాస్గుప్తా బుధవారం మీడియాకు తెలిపారు.
ముఖ్యంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇంజనీరింగ్, హోం, రవాణా తదితర శాఖలలో నిరుద్యోగులను నియమించేందుకు తమ మంత్రి వర్గం నిర్ణంయించిందని ఆయన మంత్రివర్గ సమావేశానంతరం ఈ విషయం మీడియాకు వివరించారు.
ఈ నేపథ్యంలో భాగంగా తొలి విడతలో 150 మందిని నియమించనున్నామని, వివిధ స్థాయిల్లోనున్న ట్రామా కేంద్రాలలో వీరిని నియమించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆర్జి కార్ వైద్య కళాశాల, ఆసుపత్రిని అభివృద్ధి పరిచేదిశలో భాగంగా కొత్తగా ఉద్యోగులను నియమించనున్నామని, అలాగే రాష్ట్రంలోని ఎస్ఎస్కేఎమ్ ఆసుపత్రిని కూడా అభివృద్ధి చేయనున్నామని ఆయన తెలిపారు.