ఆర్ట్స్ గ్రూపు విద్యార్థులన్నా, ఆ చదువులన్న ఎప్పటి నుంచో సమాజంలో చిన్న చూపు ఉంది. ఇది అన్ని చోట్ల అందరిలో కాకపోయినా చాలా చోట్ల, చాలా మందిలో ఉన్న అభిప్రాయమే. శాస్త్రసాంకేతికత పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఈ కోర్సులకు ఇంకా ఎక్కడ గిరాకీ ఉందనే వారూ లేక పోలేదు.
ఒక రకంగా ఇది నిజమే అయినప్పటికీ ఆర్ట్స్ గ్రూపులు పూర్తిగా నిరాధరణకు గురవుతున్నాయనడంలో అర్థం లేదు. ఏ చదువు చదివినా కాస్తంత ఇంగ్లీషు పరిజ్ఞానం కలిగి ఉంటే చాలు. ఉద్యోగాలు వస్తున్నాయనడంలో సందేహం లేదు. ఈ మధ్య కాలంలో స్పచ్ఛంద సంస్థల్లో ఉద్యోగాల సంఖ్య కూడా పెరుగుతోంది.
ఆర్ట్సు గ్రూపులు చదివామని ఉద్యోగాలు రావని అనుకుంటూ కూర్చోవడం కంటే సమాజంలో ఏం జరుగుతోందనే విషయం కనుక్కుంటే సరిపోతుంది. ప్రస్తుతం వివిధ దేశాలలో స్వచ్ఛంద సంస్థలు తమ సేవలను అందించడానికి ముందుకు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో వారికి ఉద్యోగుల అవసరం ఏర్పడుతోంది. కాస్తంత చొరవ సామాజిక దృక్పథం ఉన్నవారెవరైనా ఈ రంగంలో దూసుకు పోతున్నారు.
ఇందుకోసం వివిధ విశ్వవిద్యాలయాలు కోర్సులను ప్రవేశ పెడుతున్నాయి. ఇందిరాగాంధీ జాతీయ ఓపెన్ యూనివర్శిటీ సర్టిఫికెట్ కోర్సును ప్రవేశపెట్టింది. ఇందుకు ఐక్యరాజ్య సమితిలో ఎయిడ్స్ విభాగం ఇందుకు సహకరిస్తోంది.
ఈ కోర్సు దాదాపు 10 అంతర్జాతీయ సంస్థల సహకారంతో నిర్వహిస్తున్నారు. ఇవన్నీ కూడా దాదాపుగా ప్రపంచ వ్యాప్తంగా సేవలు అందిస్తున్నవే. సమాజంలో ఎదురవుతున్న సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఈ కోర్సులలో తర్ఫీదు ఇస్తారు. ఈ కోర్సులు అయిపోయిన తరువాత స్వచ్ఛంద సంస్థల్లో మంచి అవకాశాలు లభిస్తున్నాయి.
ఈ తరహాలో ఉండే వాటిలో కోర్సులను మూడు విభాగాలుగా విభజించారు. కొన్ని కోర్సులు ప్రణాళికలకు సంబంధించినవైతే, మరికొన్ని యాజమాన్య పద్దతులకు సంబంధించినవి. ఇంకొన్ని ప్రణాళికల అమలు తదితర అంశాలకు సంబంధించినవి కావడం విశేషం.