Publish Date: Tue, 31 Dec 2019 (11:40 IST)
Updated Date: Tue, 31 Dec 2019 (11:41 IST)
రోజురోజుకీ ఏటీఎం మోసాలు ఎక్కువవుతుండటంతో వీటిని నివారించడానికి ఎస్బిఐ చర్యలు ప్రారంభించింది. ఏటిఎం మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరి 1 నుంచి కొత్త విధానం అమలులోకి తీసుకురానుంది.
ఎస్బిఐ కస్టమర్లు జనవరి 1వ తేదీ నుంచి రూ. 10 వేలు, అంతకంటే ఎక్కువ డబ్బు విత్డ్రా చేసుకోవాలంటే ఓటీపీని నమోదు చేయవలసి ఉంటుంది. అయితే ఈ ఓటీపీ విధానం రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మాత్రమే వర్తిస్తుందని ఎస్బిఐ పేర్కొంది. ఈ సమయంలో పది వేలకు పైన డబ్బు విత్డ్రా చేసుకునే కస్టమర్లను ఓటీపీ నమోదు చేయమని అడుగుతుంది.
కస్టమర్ రిజిస్టర్డ్ మొబైల్కు వచ్చిన ఓటీపీని నమోదు చేస్తే మాత్రమే విత్డ్రా చేయడం వీలవుతుంది. ఓటీపీ విధానం ద్వారా అనధికారిక లావాదేవీలను నివారించవచ్చని ఎస్బిఐ పేర్కొంది. అయితే ఎస్బిఐ వినియోగదారులు ఇతర ఏటీఎంల్లో లేదా ఇతర బ్యాంక్ కార్డ్ వినియోగదారులు ఎస్బిఐ ఏటీఎంల్ల ఈ సదుపాయాన్ని పొందలేరు.