Publish Date: Tue, 14 Jan 2020 (12:44 IST)
Updated Date: Tue, 14 Jan 2020 (12:48 IST)
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలతో పాటు.. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో విమాన ధరలకు రెక్కలు వచ్చాయి. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవి మరింత విపరీతంగా పెరిగిపోయాయి.
సంక్రాంతి పండుగను జరుపుకునేందుకు అనేక మంది తమ సొంతూర్లకు వెళుతున్నారు. ఈ ఉత్సాహం విమాన సంస్థలపై కనకవర్షం కురిపిస్తోంది. బస్సులు, రైళ్లు రద్దీగా ఉండటంతో హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు ప్రజలు విమానాల్లో వెళుతున్నారు.
హైదరాబాద్ నుంచి సింగపూర్, మలేషియా, థాయ్లాండ్, కొలంబో కన్నా ఏపీలోని విశాఖ, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ వెళ్లే విమాన సర్వీసులకు ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయి. రాజమండ్రికి అయితే ఒకరోజు ముందుగానే టిక్కెట్లన్నీ అమ్ముడైపోతున్నాయి.
సోమవారం హైదరాబాద్ నుంచి రాజమండ్రికి అత్యధిక టికెట్ ధర రూ.15,157గా పలికింది. మంగళవారం సాయంత్రం 3:45 నిమిషాలకు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వెళ్లే విమాన ఛార్జీ ఏకంగా రూ.19,518గా ఉంది. హైదరాబాద్ నుంచి తిరుపతికి సోమవారం అత్యధికంగా రూ.12,027 ధర పలకగా మంగళవారం రూ.12843లు ఉంది.
అలాగే, విశాఖకు సోమవారం రూ.10,976 ధర ఉండగా మంగళవారం కూడా అత్యధికంగా ఇదే ధర ఉంది. విజయవాడకు సోమవారం అత్యధికంగా రూ.9995లు ధర పలకగా మంగళవారం రాత్రి టిక్కెట్ ధర రూ.14837గా ఉంది.
ఠాగూర్
Publish Date: Tue, 14 Jan 2020 (12:44 IST)
Updated Date: Tue, 14 Jan 2020 (12:48 IST)