Publish Date: Tue, 29 Jan 2019 (13:51 IST)
Updated Date: Tue, 29 Jan 2019 (13:54 IST)
విజయవాడ నగరానికి మరొక ప్రత్యేకత లభించబోతోంది. విజయవాడలో ప్రస్తుతం ఉన్న విమానాశ్రయం నుంచి నేరుగా కాశీకి వెళ్లే ప్రత్యేక విమానం ఒకటి అందుబాటులోకి రానుండడంతోపాటు అందులోనూ టిక్కెట్ కేవలం రూ.2500 మాత్రమే కావడంతో సదరు విమాన సేవల ప్రారంభం కోసం చాలా మంది భక్తులు ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 17వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్న ఈ సర్వీసు కోసం 180 మంది ప్రయాణికులు పట్టే భారీ విమానాన్ని సిద్ధం చేస్తున్నారు.
కాగా ఈ సర్వీసు గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్ మీదుగా కాశీకి చేరుకుంటుంది. ఇప్పటివరకు కాశీకి వెళ్లేవారు ఢిల్లీకి చేరుకొని అక్కడి నుండి మరొక విమానంలో వెళ్తూండేవారు, అలాకాకుండా రైలు లేదా రోడ్డు మార్గాలలో వెళ్లాలనుకునేవారు దాదాపు 30 గంటలకు పైగా ప్రయాణం చేయాల్సి ఉండేది.
అయితే నేరుగా వెళ్లగలిగే ఈ విమాన సేవల ద్వారా విజయవాడ నుంచి కాశీకి కేవలం మూడు నాలుగు గంటల్లోనే వెళ్లగలగడం, రైలులో వెళ్లడానికి 30 గంటలకు పైగా పట్టడమనే ఇబ్బందిని అధిగమించడంపాటు అందులోని సెకండ్ ఏసీ ప్రయాణ టిక్కెట్ ధరకే విమానయానం కల్పించడం పట్ల చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.