Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెద్ద నోట్లు రద్దు చేసింది చైనా కంపెనీలను మేపడానికా.. హవ్వ!

పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం బయటపడటం, దేశ ప్రజలకు మేలు జరగటం మాటేమిటో గానీ చైనా కంపెనీలు దేశీయ మార్కెట్లో లాభాల మోత మోగిస్తున్నాయి. గత అక్టోబర్, నవంబర్ నెలల్లో భారత్‌లో తమ మార్కెట్ వాటాను చైనా కంపెనీలు ఎంతగా పెంచుకున్నాయంటే దేశీయ కంపెనీలు మన మార్కెట్ల

పెద్ద నోట్లు రద్దు చేసింది చైనా కంపెనీలను మేపడానికా.. హవ్వ!
హైదరాబాద్ , ఆదివారం, 29 జనవరి 2017 (05:44 IST)
పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం బయటపడటం, దేశ ప్రజలకు మేలు జరగటం మాటేమిటో గానీ చైనా కంపెనీలు దేశీయ మార్కెట్లో లాభాల మోత మోగిస్తున్నాయి. గత అక్టోబర్, నవంబర్ నెలల్లో భారత్‌లో తమ మార్కెట్ వాటాను చైనా కంపెనీలు ఎంతగా పెంచుకున్నాయంటే దేశీయ కంపెనీలు మన మార్కెట్లో ఢమాల్ మన్నాయట. దీంతో నగదు రద్దు ఫలితం ఇదా అంటూ మన దేశీయ మొబైల్ కంపెనీలు తలబాదుకుంటున్నాయని వార్తలు. పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో 50 ప్రధాన నగరాల్లో మొత్తం స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు 31 శాతం మేర తగ్గిపోయినట్టు ఐడిసి చెబుతోంది. చిన్న పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చేతిలో డబ్బులేని కారణంగా చాలా మంది కస్టమర్లు తమ కొనుగోళ్లను వాయిదా వేసుకోవడం వల్ల ఈ పరిణామం చోటు చేసుకుంది.
 
భారతీయ మార్కెట్లోకి అత్యాధునిక ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్లను తెస్తూ చైనా కంపెనీలు దేశీయ కస్టమర్లను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నాయి. ఆన్‌లైన్‌లోనే కాకుండా రిటైల్‌ స్టోర్ల ద్వారానూ వీటి అమ్మకాలు జోరుగా పుంజుకుంటున్నాయి. నాణ్యతతోపాటు ఈ కంపెనీలు పెద్ద ఎత్తున చేస్తున్న ప్రకటనల కారణంగా కస్టమర్లు వాటి వైపే మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా దేశీయ కంపెనీలకు పోటీ అనివార్యమవుతోంది. చైనా కంపెనీలతో పోటీ పడలేక దేశీ కంపెనీలు మార్కెట్‌ వాటాను చేజార్చుకుంటున్నాయి. 
 
పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశీయ కంపెనీల ఫోన్ల అమ్మకాలే చైనా కంపెనీల ఫోన్ల కన్నా ఎక్కువగా తగ్గిపోవడం గమనార్హం. గత నవంబర్‌ నెలలో దేశంలోని 50 అగ్రస్థాయి పట్టణాల్లో భారత కంపెనీల అమ్మకాలు అక్టోబర్‌తో పోల్చితే 37.2 శాతం మేర తగ్గిపోయాయి. చైనా కంపెనీల అమ్మకాలు మాత్రం 26.5 శాతమే తగ్గాయి. ఇక 50 నగరాల్లో అక్టోబర్‌లో చైనా కంపెనీల మార్కెట్‌ వాటా 38.3 శాతం ఉండగా.. నవంబర్‌లో 40.7 శాతానికి పెరిగింది. భారత కంపెనీల వాటా 26.7 శాతం నుంచి 24.2 శాతానికి క్షీణించింది. 
 
అక్టోబర్‌లో ప్రథమ శ్రేణి నగరాల్లో చైనా కంపెనీల వాటా 38.7 శాతంగా ఉంటే.. నవంబర్‌లో 42.6 శాతానికి పెరిగింది. ఇదే కాలంలో భారత కంపెనీల మార్కెట్‌ వాటా 26.8 శాతం నుంచి 24.2 శాతానికి దిగజారింది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో చైనా కంపెనీల వాటా 38 శాతం నుంచి 39 శాతానికి పెరగ్గా.. భారత కంపెనీల వాటా 26.6 శాతం నుంచి 24.2 శాతానికి చేరుకుంది. భారత కంపెనీలు రిటైల్‌ స్టోర్ల ద్వారా అమ్మకాలను పెంచుకోవడంలో ఆపసోపాలు పడుతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే తరుణంలో ఒప్పో, వివో వంటి చైనా కంపెనీలు పెద్ద ఎత్తున ప్రచారం చేసి తమ అమ్మకాలను పెంచుకుంటున్నాయి.
 
దేశీయ కంపెనీలకు విదేశీ సంస్థల నుంచి పోటీ పెరుగుతుండటం వల్ల మార్కెట్‌ వాటా క్రమక్రమంగా తగ్గిపోతోంది. 2015 నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. 2014 సంవత్సరంలో చైనా కంపెనీల మార్కెట్‌ వాటా 15 శాతం ఉండేది. 2016 సంవత్సరంలో ఇది 35 శాతం దాటేసింది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా బ్రాండ్ ఇమేజ్ ఎంత పెరిగిపోయిందో చూశారా: మురిసిపోయిన బాబు