Publish Date: Mon, 29 Feb 2016 (11:13 IST)
Updated Date: Mon, 29 Feb 2016 (11:47 IST)
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ 2016-17 ఆర్థిక సంవత్సరానికిగాను సాధారణ బడ్జెట్ను సోమవారం ఉదయం 11 గంటలకు లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆయన తన ప్రసంగంలోనే ప్రపంచ ఆర్థిక మందగమనాన్ని గుర్తు చేశారు. గత 2014లో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 3.3 శాతంగా ఉండగా, 2015లో ఇది 3.1 శాతానికి దిగజారిందని ఆయన గుర్తు చేశారు.
అయితే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక ప్రకారం భారత్ ఆర్థిక వృద్ధిరేటు మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందని పేర్కొందని అరుణ్ జైట్లీ సభకు తెలిపారు. గత 21 నెలలుగా తాము తీసుకున్న అనేక చర్యల వల్ల వృద్ధిరేటు పెరిగిందన్నారు. దేశ వృద్ధి రేటు 6.3 శాతం నుంచి 7.6 శాతానికి పెరిగిందన్నారు.
ఈ క్రమంలో తమకు ఎదురవుతున్న అనేక సవాళ్ళను అవకాశాలుగా మలుచుకుంటూ ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. కరెంట్ అకౌంట్ లోటును గణనీయంగా తగ్గించినట్టు తెలిపారు. అలాగే, గత రెండేళ్ళుగా వర్షాభావ పరిస్థితులు ఏమాత్రం బాగాలేదని, ప్రస్తుతం వర్షాభావం 13 శాతంగా నమోదైందని ఆయన చెప్పారు.