Publish Date: Tue, 09 Feb 2016 (19:02 IST)
Updated Date: Tue, 09 Feb 2016 (19:04 IST)
కళాకారుల జీవితం స్ఫూర్తిదాయకం అని వారిపై గ్రంధాలు వెలువడటం అభినందనీయమని కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు గ్రహీత ఆచార్య ఎన్. గోపి అన్నారు. డా. ఎస్.ఆర్. ఎస్. కొల్లూరి రచించిన"నాలో నీలో గజల్ శ్రీనివాస్" పుస్తకావిష్కరణ కార్యక్రమం యువకళావాహిని ఆధ్వర్యంలో బంజారాహిల్స్ ప్రసాద్ లాబ్స్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డా ఎన్. గోపి గ్రంథాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజల్ శ్రీనివాస్ గొప్ప వాగ్గేయకారుడని తన గాత్రంతో లక్షల మందిని చైతన్యపరిచే శక్తి శ్రీనివాస్ సొంతమని అన్నారు. ఈ కార్యక్రమానికి శ్రీ సారిపల్లి కొండలరావు సభాధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనమండలి సభ్యులు శ్రీ రుద్రరాజు పద్మరాజు జ్యోతి ప్రజ్వలన చేసారు.
ఈ కార్యక్రమానికి విశిష్ఠ అతిథిగా విచ్చేసిన ప్రముఖ సినీ సంగీత దర్శకుడు శ్రీ ఆర్.పి. పట్నాయక్ మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా ప్రపంచ దేశాలలో తెలుగు వెలుగులను ప్రకాశవంతం చేస్తూ వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతున్న చైతన్యమూర్తి గజల్ శ్రీనివాస్ అని అన్నారు. మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సినీ గేయ రచయిత జె.కె. భారవి మాట్లాడుతూ, మూడుసార్లు గిన్నిస్ రికార్డులను సొంతం చేసుకుని, 125 భాషలలో గానం చేసిన అత్యంత ప్రతిభావంతుడు డా. గజల్ శ్రీనివాస్ అని అన్నారు.
గ్రంధ సమీక్ష చేసిన సినీ గేయ రచయిత శ్రీ సిరశ్రి మాట్లాడుతూ గజల్ శ్రీనివాస్ గారి 30 సంవత్సరాల గాన ప్రస్థానాన్ని, చేస్తున్న సేవా కార్యక్రమాలను, డా. కొల్లూరి 125 నానీలులో రాయడం హృద్యంగా ఉంది అన్నారు. మరో సినీ గేయ రచయిత భాస్కరభట్ల మాట్లాడుతూ మానవతా విలువలను, ప్రపంచ శాంతిని, గాంధేయ వాదాన్ని ఈనాటి తరానికి తనదైన శైలిలో అందిస్తున్న శ్రీనివాస్ గారిపై ఈ గ్రంధం రాయడం ఔచిత్యవంతంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ రాజ్ కందుకూరి, శ్రీ జి. హనుమంత రావ్ మరియు వై కె నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
About Writer
ivr
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories....
Read More