Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డోనల్డ్ ట్రంప్: అమెరికాలోకి వలసలను నిషేధించడం వల్ల భారత్‌పై పడే ప్రభావం ఎంత?

డోనల్డ్ ట్రంప్: అమెరికాలోకి వలసలను నిషేధించడం వల్ల భారత్‌పై పడే ప్రభావం ఎంత?
, శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (12:43 IST)
వలసవచ్చినవారు అమెరికాలో స్థిరపడడంపై ప్రస్తుతానికి నిషేధం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చెప్పారు.ఇతర దేశాల ప్రజలు అమెరికా వచ్చి స్థిరపడడంపై తక్షణం నిషేధం అమలు చేసే నిర్ణయంపై సంతకం చేస్తానని ఆయన ట్వీట్ చేశారు. కరోనా సంక్షోభం దృష్ట్యా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

 
అధ్యక్షుడు ట్రంప్ చర్యలు చాలావరకూ రాజకీయంలా కనిపిస్తున్నాయని, ఎందుకంటే కరోనా సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని అమెరికా ఇప్పటికే ఎన్నో చర్యలు చేపట్టిందని నిపుణులు చెబుతున్నారు. మెక్సికో, కెనడాలతో ఉన్న అమెరికా సరిహద్దు ఇంతకు ముందే సీల్ చేశారు. అందుకే, ప్రస్తుతానికి వలసలు అనేవే లేవు. విమానాల రాకపోకలు కూడా ఆగిపోయి ఉన్నాయి. పర్యటక రంగంపై కూడా నిషేధం ఉంది. అందుకే ఆయన ఈ కొత్త నిర్ణయం వల్ల క్షేత్రస్థాయిలో ప్రస్తుతానికి ఎలాంటి ప్రాక్టికల్ ప్రభావం ఉండదని భావిస్తున్నారు.

 
సకాలంలో కరోనా మహమ్మారిని అడ్డుకోలేకపోయారని, అందుకే అమెరికా కోవిడ్-19కు కేంద్రంగా మారిందని ట్రంప్ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. అమెరికా ఎదుట భారీ ఆర్థికసంక్షోభం కూడా ఉంది.అమెరికాలో ఒక వర్గం లాక్‌డౌన్ తొలగించాలని కూడా డిమాండ్ చేస్తోంది. చాలా ప్రాంతాల్లో దీని కోసం ఆందోళనలు కూడా జరుగుతున్నాయి.

 
ఎన్నికల కోసమే నిర్ణయం
ట్రంప్ నిర్ణయం గురించి బీబీసీతో మాట్లాడిన అంతర్జాతీయ నిపుణులు హర్ష్ పంత్ “అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. వలసదారులను లక్ష్యంగా చేసుకునే విధానాన్ని ఇకముందు కూడా కొనసాగిస్తానని ట్రంప్ ఓటర్లకు ఒక సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఆయన నిలబెట్టుకుంటున్నారు. అందుకే, ఇది ఎన్నికలు రాకముందే గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నట్లు అనిపిస్తోంది” అన్నారు.

 
అయితే ఇది తాత్కాలిక నిషేధమే అంటున్నారు. కానీ అది ఎంత తాత్కాలికం, ఈ నిషేధం ఎప్పుడు ఎత్తేస్తారు అనేది చెప్పడం కష్టం. ప్రస్తుతానికి అమెరికా అసాధరణ స్థితిలో చిక్కుకుని ఉంది. ఆ దేశంలో కరోనా తీవ్రత పెరగడం చూస్తుంటే ఈ నిషేధం ఎన్నికల వరకూ కొనసాగవచ్చేమో అనిపిస్తోంది. చట్టబద్ధమైన వలసలను తగ్గించడానికి ఆయన తన మొత్తం పదవీకాలంలో ఎన్నోసార్లు పాలనాపరమైన చర్యలు కూడా చేపట్టారు. వాటి వల్ల అమెరికాలో ఆ వలసలు చాలా తగ్గిపోయాయని హర్ష్ పంత్ భావిస్తున్నారు.

 
భారత్‌పై ఎలాంటి ప్రభావం
గణాంకాలను ఒకసారి గమనిస్తే గ్రీన్ కార్డ్ కోసం అమెరికా వెళ్లే భారతీయుల సంఖ్య ఇప్పటికే తగ్గింది. హర్ష్ పంత్ వివరాల ప్రకారం గత ఏడాది ఆ సంఖ్యలో 7 నుంచి 8 శాతం తగ్గుదల నమోదైంది, “ట్రంప్ పదవీకాలంలో అమెరికా వలసవెళ్లే వారిలో భారతీయుల భాగం మొదటి నుంచీ తగ్గుతూ వస్తోంది. ఎందుకంటే, ట్రంప్ ప్రభుత్వం మొదటి నుంచి తమ వలస విధానాన్ని టైట్ చేయడానికి ప్రయత్నించింది” అని ఆయన చెప్పారు.

 
అమెరికాకు వెళ్లాలంటే స్పౌస్ వీసా, డిపెండెంట్ వీసా ఇప్పుడు చాలా కష్టంగా లభిస్తోంది. ఎవరైనా తమ కుటుంబాన్ని తీసుకుని అక్కడకు వెళ్లాలని అనుకుంటే అది చాలా కఠినంగా మారింది. దానితోపాటు అమెరికాకు వెళ్లడానికి పెట్టుకునే అప్లికేషన్లను కూడా చాలా నిశితంగా పరిశీలిస్తున్నారు. దానికి చాలా టైం తీసుకుంటున్నారు. భారీ సంఖ్యలో వీసాలు రెజెక్ట్ కూడా అవుతున్నాయి. ఇవన్నీ కలిపి చూస్తే, దాని ప్రకారం ఏడెమినిది శాతం మంది భారతీయులు వెళ్లడం ఇంతకు ముందు నుంచే తగ్గిపోయింది.

 
భారత విద్యార్థులు, హెచ్1బి వీసా కోరుకునేవారిపై ప్రభావం
“ట్రంప్ పాలనలో ఇది కీలక విధానంగా ఉంది. ఆయన మొదట హెచ్1బీ వీసాలనే లక్ష్యంగా చేసుకున్నారు. టెక్నికల్ కంపెనీలు ఎవరినీ ఉద్యోగాల్లో పెట్టుకోవడం ఉండదని చెప్పారు. దాంతో ఆయనపట్ల వ్యతిరేకత వచ్చింది. భారత్ కూడా తమ వాదన వినిపించింది. ఆ తర్వాత ఈ కేసుల్లో పరిమితి పెంచారు. మార్పులు కూడా చేశారు” అని హర్ష్ పంత్ చెప్పారు.

 
కానీ, ట్రంప్ ప్రభుత్వ విస్తృత ధోరణి వలసలు అమెరికాకు ప్రయోజనకరం కాదు అనేలా ఉన్నాయి. అది అక్రమ వలసలకు అసలు అనుకూలంగా లేదు. కానీ, చట్బపరమైన వలసల్లో కూడా కోత విధించడానికి వారు అన్నిరకాల ప్రయత్నాలూ చేస్తూనే ఉన్నారు. అందుకే వాటిలో తగ్గుదల కనిపిస్తోంది.

 
హెచ్1బి వీసాల కొత్త అప్లికేషన్లు, అంతర్జాతీయ విద్యార్థులకు జరిగే ట్రైనింగ్ ప్రోగ్రాంలపై అధ్యక్షుడు ట్రంప్ కొత్త నిర్ణయం ప్రభావం పడవచ్చని, దానివల్ల నేరుగా భారతీయులపై ఆ ఎఫెక్ట్ ఉండవచ్చని హర్ష్ పంత్ భావిస్తున్నారు.

 
“ఎందుకంటే, ఇప్పటివరకూ హెచ్1బి వీసా అప్లికేషన్ ప్రోగ్రాం పూర్తి కాలేదు. అందుకే వాటిలో వ్యత్యాసం కనిపించవచ్చు. అంతే కాదు, భారతీయులు సహా విద్యార్థులందరూ అమెరికాలో సైన్స్ లేదా టెక్నాలజీ రంగంలో చదువు పూర్తి చేస్తున్నారు. ఆ తర్వాత 12 లేదా 36 నెలల ట్రైనింగ్ కోసం వారు అక్కడే ఉండచ్చు. అందుకే, వారికి వీసా పొడిగింపు లభిస్తుంది. కానీ కొత్త సెషన్‌లో ఉండే వారికి ఇబ్బందులు ఉండవచ్చు” అన్నారు. అయితే, ఈ విధానాన్ని యుద్ధ ప్రాతిపదికన ఎలా అమలు చేస్తారు అనేదానిపై ఇంకా స్పష్టత లేదు. అంతేకాదు, ఈ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేసే అవకాశం కూడా ఉంది.

 
వలసదారుల సంఖ్య
అమెరికా ప్రతి ఏటా చట్టబద్ధంగా వచ్చే వలసదారులను అత్యధిక సంఖ్యలో దేశంలోకి అనుమతిస్తుంది. అమెరికా హోంమంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 2019లో 10 లక్షల మందికి పైగా విదేశీయులకు అమెరికా నుంచి చట్టపరంగా, శాశ్వతంగా ఉండడానికి అనుమతి లభించింది. వీరిలో ఎక్కువగా మెక్సికో, చైనా, భారత్, ఫిలిప్పీన్స్, క్యూబా వారు ఉన్నారు.

 
అయితే, వీరిలో భారతీయుల సంఖ్య 10-12 శాతాన్ని మించి ఉండదని నిపుణులు భావిస్తున్నారు. ఈ 10 లక్షల మందిలో సగానికి పైగా అంతకు ముందే అమెరికాలో నివసిస్తున్న వారు ఉన్నారు. మిగతా 4,59,000 మంది విదేశాల నుంచి వచ్చారు. వీరిలో భారతీయుల సంఖ్య పెద్దగా లేదు. ఎందుకంటే భారతీయులు ఎక్కువగా అక్కడి హై-ఎండ్ టెక్నాలజీ రంగం నుంచే వస్తారు.

 
భారతీయులు ఎక్కువగా హెచ్1బి వీసాల వారే ఉంటారు. లేదా వారిపై ఆధారపడ్డ భర్త, భార్య, లేదంటే తల్లిదండ్రులు ఉంటారు. ట్రంప్ ప్రభుత్వం చట్టపరంగా వలస వచ్చే వారిని తగ్గించడానికి ప్రయత్నిస్తోంది. వారు చాలా ఎక్కువమంది ఉన్నారని, ఆ సంఖ్యను తగ్గించాలని అధ్యక్షుడు పదే పదే చెబుతున్నారు.

 
“ప్రస్తుతం కరోనా సంక్షోభంలో ట్రంప్ ప్రభుత్వానికి ఒక అవకాశం లభించింది. అది ఆ అవకాశం నుంచి ప్రయోజనం పొందాలని ప్రయత్నిస్తోంది. దానివల్ల తమకు రాజకీయ ప్రయోజనం కూడా లభిస్తుందని ట్రంప్ భావిస్తున్నారు” అని నిపుణులు చెబుతున్నారు. “అయితే, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో అలా పెద్ద పెద్ద ప్రకటనలు చేయడం చూస్తుంటే, వారు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండడం మంచిది అనిపిస్తోంది” అని బీబీసీ ఉత్తర అమెరికా రిపోర్టర్ ఏంటొనీ జర్చర్ అన్నారు.

 
ఇప్పటివరకూ ఆయన ట్విటర్‌లో ఎన్ని పెద్ద ప్రకటనలు చేశారో, వాటిలో కొన్నింటిని అమలు చేశారు, కొన్ని చేయలేదు. “అయితే, ట్రంప్ కొత్త ప్రకటన గురించి ఇంకా విస్తృత సమాచారం రాలేదు. అది లేకుండా ఆయన చేసిన ఈ ప్రకటన ప్రామాణికత, తీవ్రత గురించి పెద్దగా అర్థం కాదు” అన్నారు.

 
ఆ విషయం ట్రంప్ ట్వీట్ భాషలో స్పష్టంగా తెలుస్తోంది. ట్రంప్ “తను ఈ నిర్ణయం కేవలం అమెరికా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, ముఖ్యంగా గ్రేట్ అమెరికా పౌరుల ఉద్యోగాలను కాపాడడం కోసమే తీసుకున్నాను” అని చెప్పారు. ఇక, దీని పాలనాపరమైన ఆదేశాలు ఎప్పుడు వస్తాయో, అందులో వారు ఏమేం వివరాలు మన ముందుకు తీసుకొస్తారో వేచిచూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎండల్లో కరోనా వైరస్ మాడిపోతుందట.. నేను చెప్తే విన్నారా? ట్రంప్