Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా వైరస్: ఇది మీ జేబుపై, మీరు కొనే వస్తువులపై ఇలా ప్రభావం చూపుతోంది

కరోనా వైరస్: ఇది మీ జేబుపై, మీరు కొనే వస్తువులపై ఇలా ప్రభావం చూపుతోంది
, గురువారం, 12 మార్చి 2020 (15:32 IST)
చైనాలో కరోనావైరస్ ప్రభావం వల్ల అమెరికాలో పెళ్లి కూతురికి వెడ్డింగ్ డ్రెస్ దొరక్కపోతే.. అవును.. ఇప్పుడు అదే జరుగుతోంది. చైనాలో కరోనావైరస్ కారణంగా ఏకంగా ప్రపంచంపైనే ప్రభావం పడుతోంది. ప్రపంచంలో కొనే అనేక వస్తువులపైన, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా ఈ ప్రభావం ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

 
లండన్‌కు చెందిన కన్సల్టెన్సీ సంస్థ కేపిటల్ ఎకనమిక్స్ అంచనాల ప్రకారం 2020 మొదటి త్రైమాసికంలోనే కరోనా వైరస్ వల్ల 28,000 కోట్ల డాలర్ల నష్టం వాటిల్లనుంది. ఇది మొత్తం యూరోపియన్ యూనియన్ వార్షిక బడ్జెట్‌తో సమానం, మైక్రోసాఫ్ట్ వార్షిక ఆదాయానికి సమానం, యాపిల్ సంస్థ వార్షిక రాబడికి సమానం.. ఏదైనా దేశాన్ని ఉదాహరణగా తీసుకుంటే కనుక నైజీరియా వార్షిక బడ్జెట్ కంటే ఇది 8 రెట్లు అధికం.

 
ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ కర్మాగారంగా పిలుచుకునే చైనా కరోనా వైరస్‌తో స్తంభించిపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఇది మీ జేబుపై, మీరు కొనే వస్తువులపై ప్రభావం చూపుతోంది. ప్రాథమికంగా చెప్పుకొంటే మీరిప్పుడీ వార్త చదువుతున్న కంప్యూటర్ లేదా టాబ్లెట్ లేదా స్మార్ట్ ఫోన్ స్క్రీన్ కానీ, వాటిలో ఉపయోగించే విడిభాగాలు కానీ చైనాలోనే తయారై ఉంటాయి. గాడ్జెట్స్‌ను పక్కనపెడితే కరోనా వైరస్ ఇంకా ఏఏ రంగాలపై ప్రభావం చూపుతుందన్నది తెలిస్తే ఆశ్చర్యపోతారు.

 
ఆరు నెలల ముందే ఆర్డర్ ఇచ్చినా
వచ్చే జులై 3న జరగబోయే తన పెళ్లి వేడుకకు వెడ్డింగ్ డ్రెస్ దొరకదని అమెరికాకు చెందిన మారియానా బ్రాడీ ఏమాత్రం ఊహించలేకపోయారు. బీబీసీ సోషల్ మీడియా ఎక్స్‌పర్ట్‌గా పనిచేస్తున్న మారియానా డిసెంబరులో షికాగో బ్రైడల్ స్టోర్‌లో వెడ్డింగ్ డ్రెస్ ఆర్డర్ చేశారు. వెడ్డింగ్ గౌన్ చైనా నుంచి రావాలన్న విషయం ఆమె మర్చిపోయారు.

 
ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే వెడ్డింగ్ డ్రెస్‌లలో 80 శాతం ఒక్క చైనాలోని సుజో నగరం నుంచే వస్తాయి. అయితే, కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా కర్మాగారాలను మూసివేయించారు. కర్మాగారాలు పనిచేస్తే పెద్ద సంఖ్యలో ప్రజలు ఒకే చోట పనిచేసి వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదముందన్న ఉద్దేశంతో ప్రభుత్వం మూసివేయించింది. ఇది ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపింది.

 
అంతేకాదు.. రవాణాపరమైన నియంత్రణలు, ఆంక్షల వల్లా గోదాముల్లో ఉన్న సరకు సరఫరా కాకుండా ఎక్కడిదక్కడ నిలిచిపోయింది. మారియానా తన వెడ్డింగ్ డ్రెస్ ఆర్డర్ ఇచ్చినప్పుడు మార్చిలో ఆమెకు అందజేస్తామని చెప్పిన షికాగో బ్రైడల్ స్టోర్ ఇప్పుడా తేదీని జులైకి మార్చింది. అది కూడా మారియానా పెళ్లి జరగాల్సిన తేదీ తరువాత వారం రోజులకు అందివ్వగలమని చెప్పింది. ''ఈ పరిస్థితి నాకేమీ కోపం తెప్పించలేదు'' అని చెప్పిన ఆమె ఇప్పుడు ఒక సెకండ్ హ్యాండ్ వెడ్డింగ్ డ్రెస్‌తో పెళ్లికి సిద్ధమవుతున్నారు.

 
మొబైల్ ఫోన్ల కొరత
చైనా పారిశ్రామిక దిగ్గజం. ప్రపంచంలో స్మార్టుఫోన్లను పెద్దసంఖ్యలో ఉత్పత్తి, ఎగుమతి చేసే దేశం చైనాయే. తాజా పరిస్థితుల వల్ల యాపిల్ ఐఫోన్లు సహా అనేక బ్రాండ్ల హ్యాండ్‌సెట్లకు కొరత ఏర్పడింది. తమ ఫోన్ల ఉత్పత్తి, అమ్మకాలపై కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా పడిందని యాపిల్ సంస్థ ఇప్పటికే ఫిబ్రవరి 17న ప్రకటించింది.

 
మార్కెట్ అధ్యయన సంస్థ కెనాలిస్.. 2019 అక్టోబరు, 2020 మార్చి మధ్య ఆర్నెళ్ల కాలంలో చైనా నుంచి స్మార్ట్ ఫోన్ల షిప్‌మెంట్‌లో 50 శాతం తగ్గుదల నమోదు కావొచ్చని అంచనా వేస్తోంది.

 
అరల్లోనే ఉండిపోయిన డిజైనర్ బ్యాగులు
ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో పర్యటకులు చైనా నుంచే వస్తారు. వారు పర్యటనలకు వెళ్లేటప్పుడు చేసే ఖర్చుతో ఇతర ఏ దేశస్థులూ పోటీ పడలేరు. చైనా టూరిస్ట్ అకాడమీ తాజా లెక్కల ప్రకారం 2018లో చైనా టూరిస్టులు 15 కోట్ల పర్యటనలు చేశారు. ఈ క్రమంలో వారు 27,000 కోట్ల డాలర్ల కంటే ఎక్కువే ఖర్చు చేశారు. అదే ఏడాది అమెరికన్ టూరిస్టులు 14420 కోట్ల డాలర్లు ఖర్చు చేసినట్లు యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజమ్ ఆర్గనైజేషన్(యూఎన్‌డబ్ల్యూటీఓ) గణాంకాలు చెబుతున్నాయి.

 
అయితే, కరోనా వైరస్ ప్రబలిన తరువాత చైనా నుంచి ప్రయాణాలు తగ్గిపోయాయి. ఇది మియన్మార్, థాయిలాండ్, కంబోడియా, వియత్నాం దేశాలకు పెద్ద దెబ్బే. ఆయా దేశాలకు వచ్చే విదేశీ టూరిస్టుల్లో చైనీయుల సంఖ్య 20 శాతానికి మించి ఉంటుంది.

 
చైనా టూరిస్టులు తగ్గడమనేది కొన్ని ధనిక దేశాలపైనా ప్రభావం చూపుతోంది. చైనా టూరిస్టులు తగ్గడం వల్ల లగ్జరీ వస్తువుల అమ్మకాలు తగ్గిపోయాయని పారిస్‌లోని దుకాణదారులు చెబుతున్నారు. పారిస్ పర్యటించేవారిలో చైనీయులు సగటున ఒక పర్యటనలో 1100 డాలర్లు ఖర్చు చేస్తారు. ఇతర దేశాల పర్యటకులతో పోల్చితే ఇది రెట్టింపు మొత్తం.

 
చైనా టూరిస్టుల సంఖ్య తగ్గడం ఇలాగే కొనసాగితే తన ఉద్యోగం పోయే ప్రమాదం ఉందని పారిస్‌లోని డ్యూటీ ఫ్రీ షాప్ పారిస్‌లుక్‌లో మేనేజరుగా పనిచేసే కాంఫొనట్ సుప్రాడిటప్రాన్ రాయిటర్స్ వార్తాసంస్థతో అన్నారు.

 
విమాన ఛార్జీలూ తగ్గుముఖం
కరోనా వైరస్ కారణంగా రాకపోకలు తగ్గిపోవడం, రవాణా ఆంక్షల వల్ల చైనాలో దేశీయ, అంతర్జాతీయ విమానసర్వీసులకు తీవ్ర అవాంతరం కలిగించింది. విమానయాన సంస్థలు కరోనా వైరస్ కారణంగా 2020లో 29,300 కోట్ల డాలర్ల మేర నష్టపోనున్నాయని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్(ఐఏటీఏ) ఫిబ్రవరి 21న తెలిపింది.

 
ఇది చైనా, ఆసియాపసిఫిక్ ప్రాంతంలోని మిగతా ఎయిర్‌లైన్స్ సంస్థలకు చేదువార్తే. ఇది విమానయాన సంస్థలకు గడ్డు సంవత్సరమని ఐఏటీఏ డైరెక్టర్ జనరల్ అలెగ్జాండ్రీ డి జునియాక్ అన్నారు. అయితే, విమానయాన సంస్థలకు గడ్డు సంవత్సరమంటే ప్రయాణికులకు మంచి సంవత్సరమే కావొచ్చు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణికులను ఆకర్షించేందుకు సంస్థలు చార్జీలను తగ్గించొచ్చని నిపుణులు చెబుతున్నారు.

 
భారతదేశంలో పలు విమానయాన సంస్థలు ఇప్పటికే ఛార్జీలను తగ్గించాయి. ఈ ప్రభావం వల్ల తమ మొదటి త్రైమాసిక ఆదాయంలో తగ్గుదల నమోదు కావొచ్చని ఇండిగో ప్రకటించింది. కరోనా వైరస్ ప్రభావం వల్ల ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా, ఇండిగో సహా చాలా విమానయాన సంస్థలు అంతర్జాతీయ, స్వదేశీ విమానయాన టిక్కెట్ల రద్దుపై పూర్తి డబ్బును తిరిగి ఇస్తామని ప్రకటించాయి. అయితే, నిర్ణీత తేదీల్లో ప్రయాణాలకే ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.

 
ఆఫ్రికా ఆర్థికావ్యవస్థలపైనా ప్రభావం
ఆఫ్రికా దేశాలతో ప్రధాన వాణిజ్య భాగస్వామిగా ఉన్న అమెరికా స్థానంలోకి 2009లో చైనా వచ్చింది. ఉదాహరణకు అంగోలా తన దేశంలో ఉత్పత్తయ్యే చమురులో అత్యధికంగా 67 శాతం చైనాకు ఎగుమతి చేస్తుంది. కానీ, ఫిబ్రవరి నుంచి చైనాలో చమురు డిమాండ్ 20 శాతం మేర తగ్గిపోయింది.

 
ఇక ఆఫ్రికా నుంచి చైనాకు ఎగుమతయ్యే రాగి విషయంలోనూ ఇదే జరిగింది. డిమాండ్ తగ్గిపోవడంతో వీటి ధరలు తగ్గిపోయాయి. ''ఆఫ్రికా దేశాలు 400 కోట్ల డాలర్ల మేర ఎగుమతి ఆదాయ నష్టాన్ని ఎదుర్కొంటున్నాయ''ని లండన్‌లోని ఓవర్సీస్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూషన్‌లోని అధ్యయనకర్త డిర్క్ విల్లెమ్ వెల్డె అన్నారు.

 
ఇరాన్, ఇటలీల్లో..
ఇరాన్, ఇటలీల్లోనూ ఈ వైరస్ ప్రబలడంతో అక్కడా వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇటలీలో వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో దుకాణాలు, రెస్టారెంట్లు మూసివేశారు. అయితే, ఈ జాగ్రత్త చర్యలు సరిపోతాయా లేదంటే ముందుముందు చేపట్టే మరిన్ని చర్యలు అక్కడి ఆర్థిక వ్యవస్థలనూ ప్రభావితం చేస్తాయా చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్టాక్ మార్కెట్లు భారీగా పతనం.. ఆర్థిక మాంద్యం తప్పదా?