Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా క్వారంటైన్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు సాంకేతికతను ఎలా వాడుతున్నాయి?

కరోనా క్వారంటైన్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు సాంకేతికతను ఎలా వాడుతున్నాయి?
, శనివారం, 4 ఏప్రియల్ 2020 (22:15 IST)
క్వారంటైన్‌లో ఉన్న కరోనావైరస్ పేషెంట్లు, అనుమానితులపై ప్రభుత్వాలు టెక్నాలజీ సహాయంతో నిఘా పెట్టాయి. కొన్ని రాష్ట్రాలు ఫోన్ నెంబర్ ద్వారా సిగ్నల్ ట్రాక్ చేస్తుంటే, మరి కొన్ని రాష్ట్రాలు వారిని ప్రతి గంటకి ఒక సెల్ఫీ పంపాలని సూచిస్తున్నాయి. ఈ రెండూ సాధ్యంకాని పక్షంలో దగ్గరలోని పోలీసులు కానీ, ఆరోగ్య సేవ కార్యకర్తలు కానీ వారి ఇళ్ళకు వెళ్లి పరిశీలించి వస్తున్నారు.

 
అయితే టెక్నాలజీతో ఎలా ట్రాక్ చేస్తున్నారు? ఎంత మందిని ఇలా ట్రాక్ చేస్తున్నారు? ఒకవేళ ఎవరైనా క్వారంటైన్ ఉల్లంఘిస్తే వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ దీని గురించి వివరిస్తూ.. "25 వేల మంది హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. వారందిరినీ జియో లొకేషన్... అంటే వారి ఫోన్ నుంచి వచ్చే సిగ్నల్‌ని కోవిడ్ 19 యాప్‌ ద్వారా ట్రాక్ చేస్తున్నాము" అని చెప్పారు.

 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆరోగ్య ఆంధ్ర అనే ఒక యాప్ ద్వారా ఇలా హోమ్ క్వారంటైన్‌లో ఉన్న వారి వివరాలు తీసుకొని ట్రాక్ చేస్తునట్లు ఆంధ్రప్రదేశ్ అధికారులు తెలిపారు. "టెక్నాలజీ కంటే కూడా, ముందు నుంచీ విదేశాల నుంచి వచ్చిన వారు, ఇప్పుడు ఢిల్లీ నుంచి వారిని గుర్తించి, వారిపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టి, వారి ఆరోగ్య లక్షణాలను గమనిస్తూ, అవసరమైన దగ్గర ఉన్నతాధికారులకు తెలియచేస్తూ తోడ్పడింది గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్లు. 

 
అయితే కొంతమంది దొరక్కుండా తప్పించుకుని తిరిగే ప్రయత్నం చేశారు. అలాంటి వారి వివరాలు తీసుకుని వారి మొబైల్ ఫోన్‌ని జియో ట్యాగ్ చేసి వారి కదలికల్ని గమనిస్తూ ఉన్నాం. క్వారంటైన్‌లో ఉన్న వారికి పాజిటివ్ అని తేలిన కేసులో వారి మొబైల్ కాల్ రికార్డ్స్ ట్రాక్ చేసి వారికి కాంటాక్ట్‌లోకి వచ్చిన వారిని ట్రేస్ చేశాం" అని వివరించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన ఒక ఉన్నతాధికారి. ఈ ప్రక్రియ అంతా కమాండ్ కంట్రోల్ రూమ్ పర్యవేక్షణలో జరుగుతోంది.

 
జియో ట్యాగింగ్ అంటే ఏంటి? అది ఎలా చేస్తారు?
సాంకేతిక నిపుణులు నల్లమోతు శ్రీధర్ దీని గురించి వివరిస్తూ.. "జియో ట్యాగింగ్ రకాల రకాల పద్ధతుల్లో చేయవచ్చు. లొకేషన్ మాత్రమే సేకరించటం జరుగుతుంది. ఉదాహరణకు హోమ్ క్వారంటైన్‌లో ఉండే వారి ఫోన్‌లో ఒక మొబైల్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి, ప్రభుత్వ సర్వర్‌కి ఎప్పటికప్పుడు అతని లొకేషన్ కోఆర్డినెట్స్ పంపుతుంది. ఇప్పుడు ప్రభుత్వం ఒక పరిధి ఏర్పాటు చేసి దాని జియో ఫెన్సింగ్ చేసి పరిధి నిర్ణయిస్తారు. 

 
ఒక వేళ ఆ వ్యక్తి ఆ నిర్ణిత పరిధి నుంచి కదిలి దూరంగా వెళ్తే దాన్ని కొలిచి ఆ వ్యక్తి ఉండాల్సిన ప్రదేశంలో లేడు అని అలర్ట్ చేస్తుంది. అయితే ఇది సాధ్య పడాలంటే మొబైల్ ఫోన్ లొకేషన్ సెట్టింగ్స్ ఆన్‌లో ఉంచాలి. ఒక వేళ ఎవరైనా ఫోన్ ఇంట్లో వదిలేసి వెళ్తే ఈ ట్రాకింగ్ చేయటం సాధ్య పడదు" అన్నారు.

 
మిగతా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి?
కర్ణాటక ప్రభుత్వం ప్రతి గంటకి ఒక సారి క్వారంటైన్‌లో ఉన్న వారు సెల్ఫీ దిగి క్వారంటైన్ వాచ్ అన్న యాప్‌లో పంపాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వారు ఇంట్లోనే ఉన్నారా లేక మరెక్కడైనా ఉన్నారా అన్నది ఆ ఫోటోలో లొకేషన్ ట్రాక్ చేస్తే తెలుస్తుంది అని నిపుణులు అంటున్నారు.

 
కేంద్ర ప్రభుత్వం కూడా గురువారం నాడు ఆరోగ్య సేతు అన్న యాప్‌ను విడుదల చేసింది. ఈ చాప్ బ్లూటూత్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ట్రాక్ చేసేందుకు, అలాగే సమాచారం అందించేందుకు కూడా ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

 
ఇలా సాంకేతికంగా నిఘా పెట్టడం సబబేనా?
అయితే క్వారంటైన్‌లో ఉండవలసిన వారిపై ఇలా సాంకేతికంగా నిఘా పెట్టడంపై పలు భిన్నాభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి. "ఎప్పుడైతే నిఘా అవసరం పడుతుందో, అప్పుడు గోప్యత ప్రశ్న వస్తుంది. నిజంగా ఇలాంటి తీవ్రమైన నిఘా అవసరమా అనేది కూడా ప్రశ్నే. ఇప్పటి పరిస్థితుల్లో క్వారంటైన్లో ఉన్న వారిని సరిగా చూసుకుంటున్నామా, వారిలో లక్షణాలు పెరుగుతున్నాయా? అనేది తెలుసుకోవడానికి నిఘా కావాలి. అనుమానితులు బయట తిరిగడం ద్వారా ఇతరులకు సోకకుండా చూడడానికి కూడా నిఘా కావాలి. 

 
ఇలాంటి సందర్బాల్లో ఒక ఆరోగ్య అవసరం శాంతిభద్రతల సమస్యగా ఎలా మారుతుంది? ఒక వ్యక్తి ఇంట్లో నుంచి రాకుండా చూడడానికి ఇంతకంటే సరళమైన మార్గాలున్నాయి. వ్యక్తి బయటకు వస్తే మోగేలా అలారంలు పెట్టవచ్చు. ఇంట్లో నుంచి వెళ్లేప్పుడు తనతో పాటు ఫోన్ పట్టుకెళ్తేనే ఈ సాంకేతిక నిఘా వల్ల ఫలితం ఉంటుంది. అంతేకాదు, అందరికీ క్వారంటైన్‌కి తగిన ఇల్లుందనే భావనలో ఇది జరగుతోంది. ఈ క్వారంటైన్ ఖర్చు పౌరులు ఎందుకు భరించాలి?

 
ప్రభుత్వం ప్రజారోగ్యంపై ఎక్కువ ఖర్చు పెట్టి ఉంటే, ఇప్పుడు అందరినీ క్వారంటైన్లో పెట్టి ‌‍ఇరవైనాలుగు గంటలూ వారి యోగక్షేమాలు చూడగలిగే మౌలిక వసతులు ఉండుండేవి. ఇప్పుడు కూడా ఈ సాంకేతిక నిఘా కోసం పెడుతున్న ఖర్చుతో ప్రజారోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపర్చవచ్చు. అసలు వారిని విమానాశ్రయం నుంచి బయటకు రానివ్వకుండా అక్కడే క్వారంటైన్ ఎందుకు చేయలేకపోయారు?" అని అంటున్నారు సాంకేతిక నిపుణులు శ్రీనివాస్ కొడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రండి దీపాలు వెలిగిద్దాం, కరోనా వైరస్ పారదోలుదాం: హరి చందన్