బలం కావాలంటే చికెన్ తందూరీ, మటన్ మంచూరియా లాగించాలని అనుకుంటారు. నాన్ వెజ్లో మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయని, బలంగా ఉండడానికి కావాల్సిన ప్రొటీన్స్ లభ్యమవుతాయని అనుకుంటారు. అయితే మాంసాహారంలో పీచు పదార్ధాలు లేకపోవడం వల్ల జీర్ణక్రియ సరిగ్గా జరగదని న్యూట్రీషియన్స్ చెబుతున్నారు. మాంసంలో లభించే ప్రొటీన్స్ కన్నా శాకాహారంలోనే ఎక్కువ లభ్యమవుతాయని మాంసాహారులు గుర్తించాలి.
శాకాహారం మరియు మాంసాహారం... ఈ రెండు ఆహారాల మధ్య తేడా అనేక రకాలుగా ఉంటుంది. కంది పప్పుకి, కోడికూరకు పోటీ పెడితే ఏది గెలుస్తోందో చూద్దాం. వంద గ్రాముల కందిపప్పులో 26 గ్రాముల ప్రోటీన్లు ఉంటే, చికెన్లోని వివిధ భాగాలలో లభించే సగటు ప్రోటీన్లు కేవలం 18.4 గ్రాములే. 350 కేలరీలతో కందులే ముందున్నాయి. కోడిలో 159 కేలరీలే లభిస్తాయి.
పప్పు ధాన్యాల్లో కార్బో హైడ్రేట్స్ 60 గ్రాములుంటే, చికెన్లో గుండు సున్నానే. పైగా కంది పప్పుకు కొవ్వు తక్కువే. కోడికి మాత్రం రెండు గ్రాములుంటుంది. ఐరన్ మాత్రం రెండింటిల్లోనూ ఇంచుమించు సమానంగానే లభిస్తుంది. మాంసాహారం జీర్ణం కావడానికి ఎనిమిది గంటలు పడితే, శాఖాహారం నాలుగు గంటల్లోనే అరిగిపోతుంది. జీర్ణ వ్యవస్థపై కూడా భారం తక్కువ పడుతుంది.
కంటికి నచ్చిందంతా కడుపులోకి దోపుకుంటే వచ్చేది అజీర్తీ, అనారోగ్యం. శారీరక శ్రమ తగ్గిపోవడంతో, తీసుకొనే ఆహారం కూడా దానికి తగ్గట్టుగానే ఉండాలి. మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ దరి చేరకూడదనుకుంటే శాఖాహారం ఉత్తమం అంటున్నారు వైద్య నిపుణులు. రోజువారీ దినచర్యలో మనకు కావాల్సిన పోషకాలు ఒట్టి శాఖాహారంలో దొరకవనుకోవడం ఒట్టి భ్రమేనని వీరు సెలవిస్తున్నారు.
ప్రపంచ ప్రసిద్ధ మేధావులు, శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు నటనటీమణులు, చిత్రకారులు, దేశాధ్యక్షులు, రచయితలు శాకాహారుల్లాగే చివరకి వరకూ గడిపారు. మరి వీరికి పోషక ఆహారాలు అందలేదని ఎవరూ అనలేరుగా...
అబ్దుల్ కలామ్, అబ్రహాం లింకన్, అల్బర్ట్ ఐన్స్టైన్, అమితాబ్ బచ్చన్, ఆరిస్టాటిల్, బ్రూక్ షీల్డ్, మహాత్మాగాంధీ, హెచ్.జీ.వెల్స్, కేట్ విన్స్లెట్, లియో టాల్స్టాయ్, లియోనార్డో డా విన్సీ, మార్క్ ట్వేయిన్, అడాల్ఫ్ హిట్లర్.... ఈ పేర్లలో కొన్నయినా మనందరికీ తెలుసు.
చెప్పొచ్చేదేమంటే వీరంతా శాకాహారులే మరి....