Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒంటరిగా పోటీ చేసే దమ్మెవరికుంది...?

ఒంటరిగా పోటీ చేసే దమ్మెవరికుంది...?

పుత్తా యర్రం రెడ్డి

, శుక్రవారం, 19 సెప్టెంబరు 2008 (19:05 IST)
తప్పని పొత్తులు
  రాష్ట్ర రాజకీయ వాతావరణం చాలా గాంభీర్యంగా తయారైంది. పైకి ఎన్ని మాటలైనా మాట్లాడవచ్చు. అన్ని సీట్లు సంపాదిస్తాం.. ఇన్ని సీట్లు సంపాదిస్తామని చెప్పవచ్చు కాని ఒంటరిగా పోటీ చేసే దమ్ము ఎవరికీ లేదు. తమకుందని ఏ రాజకీయ పార్టీ అయినా ప్రకటిస్తే అవి ఢాంబికాలే      
రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలకు ఎక్కడిక్కడ స్పీడు బ్రేకర్లు ఉన్నాయి. అసలే వాడివేడిగా ఉన్న రాజకీయాల్లోకి చిరంజీవి అడుగు పెట్టడంతో పరిస్థితి నిప్పుకు గాలి తోడైనట్లయ్యింది. కొద్ది నెలల తరువాత వేడెక్కాల్సిన వాతావరణం అప్పుడే రగులుకుంటోంది. 2004 శాసనసభకు జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎంల మధ్య పొత్తు కుదిరింది. ఆ పొత్తు మేరకే ఎన్నికల్లో పోటీ చేశారు.

తరువాత సీపీఎం, సీపీఐలు కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకున్నాయి. అంతకంటే ముందుగా టీఆర్ఎస్ కాంగ్రెస్‌కు టాటా చెప్పేసింది. ఇంతలోనే దాదాపుగా నాలుగన్నరేళ్ళు గడిచిపోయాయి. సీపీఎం అప్పుడే తెలుగుదేశం వైపు అడుగులు వేసింది. సీపీఐ అటు ఇటుగా ఊగిసలాడుతూ ఉండేది. ఇలాంటి పరిస్థితులలో తొలత లోక్‌సత్తా పార్టీ రాష్ట్రంలోకి రంగ ప్రవేశం చేసింది. ఇది జనంలో భారీ మార్పులు తీసుకురాలేక పోయినా కొద్దోగొప్పో ప్రభావాన్ని చూపుతుంది.

ఇంతలోనే పుండుమీద కారం చల్లినట్లు చీరంజీవి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఈయన రాకతో రాజకీయ రంగులు పూర్తిగా మారిపోయాయి. ఆయన ముఖ్యంగా ప్రధాన పార్టీల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొట్టగలిగారు. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ భారీగా నష్టాలను చవి చూస్తోంది. చాలా మంది నాయకులు ప్రజారాజ్యంలోకి వలస బాట పట్టారు. ఇవన్నీ నిత్యం మనం చూస్తున్న దృశ్యాలే. ఇంతటితో కొత్త పార్టీల రాక ప్రస్తుతానికి ఆగినట్లే.

ఒక్కసారి రాష్ట్రంలోని పార్టీల పరిస్థితిని పరిశీలిస్తే విప్పలేని చిక్కుముడిలాగే ఉంది. తెలంగాణ ప్రాంతాన్ని మినహాయిస్తే కాంగ్రెస్, తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీలు ప్రధానమైనవి కాగా కొన్ని చోట్ల తీవ్ర ప్రభావం చూపే సీపీఐ, సీపీఎంలు ఉండనే ఉన్నాయి. అంతగా బలం లేని పార్టీలను గమనిస్తే బీజేపీ, లోక్‌సత్తాలు ఉండనే ఉన్నాయి. అంటే మొత్తం ఏడు పార్టీలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రబావాన్ని చూపుతాయి. తెలుగుదేశం, కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశాలు ఇప్పటి వరకూ లేవు.

ఇక వామపక్షాలు టీడీపీ కలిసి పోటీ చేస్తే, కాంగ్రెస్, ప్రజారాజ్యం ఒంటరిగానే పోటీ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ ప్రాంతల్లో ప్రధానంగా ముక్కోణపు పోటీ ఉంటుంది. మిగిలిన పార్టీల ప్రభావం ఎవరిపై పడుతుందో తెలియదు. ఇలాంటి పరిస్థితులలో ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఏ పార్టీకి ఉంటుందనే అంశం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఒక్కసారి తెలంగాణ ప్రాంతానికి వద్దాం. ఇక్కడ తాజాగా మరో కొత్త పార్టీ రానే వచ్చింది. తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన దేవేంద్ర గౌడ్ నవ తెలంగాణా ప్రజా పార్టీని స్థాపించారు.

దీంతో తెలంగాణాలోని ప్రధాన పార్టీల సంఖ్య టీఆర్ఎస్, ఎన్‌టిపీపీలతో కలిపి ఐదుకు పార్టీ రంగంలో ఉంటాయి. ఇక పోతే తల్లి తెలంగాణ, మజ్లీస్ పార్టీలతో కలుపుకుంటే రంగంలో దాదాపుగా ఐదుపార్టీలు రంగంలో ఉంటాయి. కొన్ని చోట్ల మజ్లీస్, బీజేపీలు రంగంలోకి వస్తాయి. ఇలాంటి పరిస్థితులలో అంచనా వేయడం అంత సులువేమి కాదు. చీలి పోయే ఓట్ల కంటే పొత్తలకే అన్నిపార్టీలు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ఇంత గందరగోళ పరిస్థితులలో ఒంటరి పోరుకు సిద్ధపడే పార్టీ ఏది?

Share this Story:

Follow Webdunia telugu