Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీడీపీ మహానాడుకు రూ.కోటి విరాళం ఇచ్చారనీ.. రూ.142 కోట్ల అపరాధం

టీడీపీ మహానాడుకు రూ.కోటి విరాళం ఇచ్చారనీ.. రూ.142 కోట్ల అపరాధం
, బుధవారం, 21 జూన్ 2023 (10:57 IST)
తెలుగుదేశం పార్టీ మహానాడుకు కోటి రూపాయల విరాళం ఇచ్చారనీ, వైకాపా ప్రభుత్వం రూ.142 కోట్ల అపరాధం విధించింది. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం ఈ విధంగా వేధిస్తుందని సదరు నేత వాపోతున్నారు.
 
నిజానికి ఆయన గత ఎన్నికల వరకు వైకాపా నేత. పైగా నెల్లూరు జిల్లా వాసి. కానీ, ఇపుడు ఆయన చూపు టీడీపీ వైపు మళ్లింది. గత కొంతకాలంగా కాంట్రాక్టు పనులు, రహదారి కంకర క్వారీ ద్వారా మైనింగ్‌ వ్యాపారం చేస్తున్నారు. ఇటీవల టీడీపీ నిర్వహించిన మహానాడులో రూ.కోటి విరాళం అందజేశారు. 
 
వెంటనే వైకాపా ప్రభుత్వం ఆయన్ను లక్ష్యంగా చేసుకుంది.. గనులశాఖ అధికారులను రంగంలోకి దించి.. కంకర వ్యాపారంలో ఆయన అక్రమాలకు పాల్పడుతున్నారంటూ రూ.142 కోట్ల జరిమానా విధించేందుకు సిద్ధమైంది. ఇదీ కావలికి చెందిన దగుమాటి వెంకట కృష్ణారెడ్డి (కావ్య కృష్ణారెడ్డి)పై జగన్‌ ప్రభుత్వం కక్ష సాధింపు తీరు. 
 
కావ్య కృష్ణారెడ్డి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయనకు కావలి నియోజకవర్గ పరిధిలో క్వారీ, క్రషర్లు ఉన్నాయి. దాదాపు 15 ఏళ్లుగా ఆయన మైనింగ్‌ వ్యాపారం చేస్తున్నారు. ఇటీవల తెదేపా తరపున బరిలో నిలవాలని భావిస్తున్నారు. ఆ పార్టీ నేతలతో టచ్‌లో ఉన్నారు. మహానాడులో రూ.కోటి విరాళం కూడా ఇచ్చారు. దీంతో ఆయన్ను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేయడంపై వైకాపా ప్రభుత్వం దృష్టిపెట్టింది.
 
కావలి నియోజకవర్గ పరిధిలోని గట్టుపల్లి, అన్నవరం గ్రామాల్లో అక్రమంగా కంకర, గ్రావెల్‌ తవ్వి తరలిస్తున్నట్లు కొందరితో స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయించారు. ఆ వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు తెరమీదకు వచ్చారు. విచారణ జరపాలంటూ గనులశాఖను ఆదేశించారు. 
 
తొలుత నెల్లూరు, ప్రకాశం, జిల్లాల అధికారులతో విచారణ జరిపేందుకు సిద్ధమవ్వగా, సీఎంవో నుంచి ఒత్తిళ్లు రావడంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేశారు. ఆ బృందం దాదాపు పది రోజులపాటు క్వారీల్లో తనిఖీలు నిర్వహించింది. గట్టుపల్లిలోని గురురాఘవేంద్ర క్వారీ, క్రషర్‌, అన్నవరంలోని రాఘవేంద్ర క్రషర్‌లో తనిఖీలు చేపట్టింది. 
 
అలాగే అన్నవరంలో గడువు ముగిసిన ఇతర లీజుల్లోనూ తనిఖీలు జరిపారు. భారీగా అక్రమాలు జరిగాయని తేల్చారు. వీటన్నింటికీ సీనరేజ్‌ ఫీజు, అంతే విలువైన కన్సిడరేషన్‌ నగదు, 30 శాతం జిల్లా ఖనిజ నిధి (డీఎంఎఫ్‌), 2 శాతం ఖనిజాన్వేషణ ట్రస్ట్‌ (మెరిట్‌), పదింతల జరిమానా కలిపి మొత్తం రూ. 142 కోట్ల మేరకు చెల్లించాలని నివేదిక రూపొందించారు. ఈ నివేదిక గనులశాఖ సంచాలకుని కార్యాలయానికి చేరింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫైన్ కట్టమన్న ట్రాఫిక్ పోలీసులు.. బైక్‌కు నిప్పంటించిన వ్యక్తి