Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అందరి దీవెనలతో మంచి చేయాలన్నదే తపన: జగన్‌.. 'వైయస్సార్‌ నేతన్న నేస్తం' ఆర్ధిక సాయం రెండో ఏడాది విడుదల

అందరి దీవెనలతో మంచి చేయాలన్నదే తపన: జగన్‌.. 'వైయస్సార్‌ నేతన్న నేస్తం' ఆర్ధిక సాయం రెండో ఏడాది విడుదల
, శనివారం, 20 జూన్ 2020 (17:11 IST)
చేనేతలు, హస్తకళల ఉత్పత్తుల మార్కెటింగ్‌కు మరింత ప్రోత్సాహం కల్పిస్తున్నామని, ఆ దిశలో ప్రత్యేకంగా ఈ–మార్కెటింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రకటించారు.

ఈ ఏడాది అక్టోబరు 2న ఆ ప్లాట్‌ఫామ్‌ ప్రారంభం అవుతుందని, ఆ ప్రక్రియలో మూడు బ్రిడ్జిలు ఉంటాయని ఆయన వెల్లడించారు. ఒకటి సరుకులు, వస్తువుల నాణ్యత కాగా, రెండోది వాటి కొనుగోలు విధానం అని, ఇక మూడవది వాటికి పేమెంట్లు ఎలా అన్నది అని ఆయన చెప్పారు.

ఈ 13 నెలల కాలంలో చేనేతన్నలకు దాదాపు రూ.600 కోట్ల సహాయం చేశామని ముఖ్యమంత్రి వెల్లడించారు. కాగా, గత ప్రభుత్వం 5 ఏళ్లలో వారికి కనీసం రూ.200 కోట్లు కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. ప్రతి పేదవాడికి మంచి చేయాలి, మంచి జరగాలని ఆరాటపడ్డామని, ఎలా మేలు చేయాలనే తప్ప, ఎలా ఎగ్గొట్టాలని ఆలోచించలేదని చెప్పారు. అందుకే అధికారంలోకి వచ్చిన 13 నెలల్లోనే అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు చేశామని తెలిపారు.

దేవుడి దయ, మీ అందరి దీవెనలతో ఇంకా మంచి చేయాలన్న తపన ఉందని సీఎం పేర్కొన్నారు. వైయస్సార్‌ నేతన్న నేస్తం పథకంలో అర్హులెవరైనా మిగిలిపోతే, వెంటనే దరఖాస్తు చేసుకోవాలని, వారికి వచ్చే నెలలో ఆర్థిక సహాయం చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.

మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి నెలకు రూ.2 వేల చొప్పున ఏటా రూ.24 వేలు ఇస్తామని సుదీర్ఘ పాదయాత్ర, ప్రజా సంకల్పయాత్రలో హామీ ఇచ్చిన సీఎం వైయస్‌ జగన్, ఆ మాట నిలబెట్టుకుంటూ, గత ఏడాది డిసెంబరు 21న ‘వైయస్సార్‌ నేతన్న నేస్తం’ పథకానికి శ్రీకారం చుట్టారు.

అనంతపురం జిల్లా ధర్మవరం వేదికగా పథకాన్ని ప్రారంభించిన ఆయన, లబ్ధిదారుల ఖాతాల్లో రూ.24 వేల చొప్పున దాదాపు రూ.200 కోట్లు జమ చేశారు. అయితే ఇప్పుడు కరోనా వైరస్, లాక్‌డౌన్‌తో తీవ్ర కష్టాల్లో ఉన్న చేనేతన్నలను ఆదుకునేందుకు ఈ ఏడాది ఆరు నెలల ముందుగానే ‘వైయస్సార్‌ నేతన్న నేస్తం’ పథకం అమలు చేస్తున్నారు. 

క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కిన జగన్‌ ఒకేసారి 81,024 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.24 వేల చొప్పున మొత్తం రూ.194.46 కోట్లు జమ చేశారు. ఆ మొత్తాన్ని బ్యాంకులు పాత బకాయిల కింద జమ చేసుకోకుండా, అన్‌ ఇన్‌కమ్‌బర్డ్‌ ఖాతాల్లో వేశారు.

దీంతో పాటు, చేనేత సహకార సంఘాలకు గత ప్రభుత్వం బకాయి పడిన రూ.103 కోట్లు చెల్లించేందుకు ఆప్కోకు ఆ నిధులు విడుదల చేశారు. ఇంకా కరోనా వైరస్‌ వ్యాపించకుండా తయారు చేసిన మాస్కుల కోసం చేనేత సహకార సంఘాల నుంచి ఆప్కో సేకరించిన వస్త్రాలకు రూ.109 కోట్ల నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేసింది.
 
వీడియో ప్రదర్శన:
కార్యక్రమంలో తొలుత ఉప్పాడ, ధర్మవరం, చీరాల, ఏలూరు, జమ్మలమడుగు, వెంకటగిరి చేనేత వస్త్రాల ప్రత్యేకతపై వీడియో ప్రదర్శించారు. ప్రతి బుధవారం చేనేత దుస్తులు ధరించాలన్న మహానేత వైయస్సార్‌ మాటలు. పాదయాత్రలో సీఎం వైయస్‌ జగన్‌ ఇచ్చిన హామీ. చేనేతకారుల స్పందన. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ గురించి సీఎం ప్రసంగం.‘ఇది జగనన్న ప్రభుత్వం. చేనేత కుటుంబాలకు ఆత్మీయ నేస్తం’ అంటూ ఆ వీడియో ప్రదర్శించారు.
 
చేనేతలకు మంచి జరగాలి:
ఈరోజు నిజంగా చేనేతలకు మంచి జరగాలన్న తలంపుతో ఈ పథకం అమలు చేస్తున్నామని, చేనేతన్నలు కరోనాతో ఇబ్బంది పడుతున్నారని, అందుకే వారికి మేలు చేయాలని ఆరాటపడ్డామని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ చెప్పారు. 
‘గత ఏడాది డిసెంబరులో పథకం మొదలుపెట్టాం. మళ్లీ ఆరు నెలలకే  ఈ పథకం అమలు చేస్తున్నాం. గత ఏడాది డిసెంబరు 21న నా పుట్టినరోజున ఇచ్చాం. ఈసారి కరోనా కష్టాలు చూశాక, అన్ని రోజులు ఆగితే మీ కష్టాలు ఇంకా పెరుగుతాయని భావించి, ఇవాళ ఈ కార్యక్రమం అమలు చేస్తున్నాం.

కరోనాతో కష్టాలు ఉన్నాయి. మార్కెట్‌లో అమ్ముకునే పరిస్థితి లేదు. మార్కెట్లు పూర్తిగా ఓపెన్‌ కాలేదు. సరుకుల రవాణా లేదు. కొత్త కొత్త వాటితో యుద్ధం చేస్తా ఉన్నాం’ అని సీఎం పేర్కొన్నారు.
 
స్వయంగా చూశాను:
సుదీర్ఘ 3648 కి.మీ పాదయాత్రలో చేనేతన్నల కష్టాలు స్వయంగా చూశానని, దాదాపు అన్ని జిల్లాలలో వారి కష్టాలు చూశానని ముఖ్యమంత్రి చెప్పారు. వస్త్రాలు బాగా తయారు చేసినా మార్కెటింగ్‌ లేదని, మరోవైపు  ముడి సరుకుల ధరలు ఎక్కువ కావడం, దీంతో వస్త్రాలు అమ్ముకోలేకపోవడం చూశానని వెల్లడించారు,.

అందుకే మగ్గం ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మకు ఏటా రూ.24 వేలు ఇస్తానని హామీ ఇచ్చానని, ఆ మేరకు వైయస్సార్‌ నేతన్న నేస్తం అమలు చేశానని వివరించారు.
 
13 నెలల్లో దాదాపు రూ.600 కోట్లు:
గత ప్రభుత్వం 5 ఏళ్లలో చేనేత కుటుంబాలకు కనీసం రూ.200 కోట్లు కూడా ఇవ్వలేదన్న సీఎం, అలాంటిది కేవలం 13 నెలల్లోనే చేనేతలకు ఎంత ఇచ్చామన్నది వివరించారు.

‘నిరుడు ఇచ్చింది రూ.200 కోట్లు అయితే, ఇవాళ దాదాపు రూ.400 కోట్లు ఇస్తున్నాం. గత ప్రభుత్వం ఆప్కోకు బకాయి పెట్టిన రూ.103 కోట్లు, మాస్కుల తయారీ కోసం ఆప్కో నుంచి తీసుకువచ్చిన వస్త్రాలకు రూ.109 కోట్లు ఇవాళే విడుదల చేస్తున్నాం. ఆ విధంగా కేవలం 13 నెలల్లోనే దాదాపు రూ.600 కోట్లు ఇస్తున్నామంటే దేవుడి దయ. ఈ 13 నెలల్లోనే ప్రతి పేదవాడికి మంచి చేయాలి. మంచి జరగాలని ఆరాటపడ్డాం’ అని ముఖ్యమంత్రి వివరించారు.
 
అనేక పథకాలు, కార్యక్రమాలు:
ఇంకా అన్ని వర్గాల ప్రజల కోసం పలు పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ‘రైతు భరోసా, అమ్మ ఒడి, పెన్షన్‌ రూ.2250, గతంలో 44 లక్షల పెన్షన్లు ఇస్తే ఇవాళ దాదాపు 60 లక్షల అవ్వాతాతలకు పెన్షన్, 30 లక్షల ఇళ్లస్థలాల పట్టాలు వచ్చే నెల 8న ఇవ్వబోతున్నాం.పేద పిల్లలకు ఇంగ్లిష్‌ మీడియమ్, నామినేషన్‌ విధానంలో ఇచ్చే పనులు, నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు. ఇంకా 3.89 కోట్ల కుటుంబాలకు దాదాపు రూ.43 వేల కోట్లు నేరుగా వారి వారి ఖాతాలకు నగదు బదిలీ చేశాం’ అని ముఖ్యమంత్రి తెలిపారు.
 
అందుకే ఇన్ని చేయగలిగాం:
గ్రామ స్థాయి నుంచి గొప్ప మార్పులు చేశామన్న సీఎం, వలంటీర్లు, సచివాలయాల వ్యవస్థను ప్రస్తావించారు. దేవుడి దయ, అందరి చల్లని దీవెనలే అందుకు కారణమని, అందుకే 13 నెలల్లో ఇన్ని చేయగలిగామని, ఇప్పుడు దాదాపు 80 వేల కుటుంబాలకు మేలు జరుగుతోందని చెప్పారు. మగ్గం ఉన్న ప్రతి ఇంటిని వలంటీర్లు పరిశీలించి, వారి పేర్లు గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించారు.
 
అర్హులెవరైనా ఉంటే:
అర్హులు మిగలిపోతే దరఖాస్తు చేసుకోమని చెప్పామని, వారికి ఇంకా ఒక నెల సమయం ఇస్తామని సీఎం వెల్లడించారు. వారికి వచ్చే నెల ఇదే రోజున సహాయం చేస్తామని తెలిపారు. మంచి చేయాలి అన్నదే తప్ప, ఎలా ఎగ్గొట్టాలని కాదని.. అందుకే సహాయం అందని వారు అస్సలు కంగారు పడొద్దని, వారికి భరోసా ఇస్తున్నానని చెప్పారు.
 
1902కు ఫోన్‌ చేయండి:
‘మీకు అర్హత ఉంటే వెంటనే గ్రామ సచివాలయానికి వెళ్లి, మా ఇంట్లో మగ్గం ఉంది కాబట్టి ఆర్ధికసాయం చేయాలని, చేనేత పెన్షన్‌ కావాలని దరఖాస్తు చేయండి. మీకు అర్హత ఉంటే వచ్చే నెల ఇదే తేదీన సహాయం చేస్తాం. ఎవరికి ఏ సమస్య వచ్చినా 1902కు ఫోన్‌ చేయండి. ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ప్రతి చేనేత కుటుంబానికి, చేనేతన్నకి  భరోసా ఇస్తున్నాను’ అని ముఖ్యమంత్రి వివరించారు.
 
ఈ–మార్కెటింగ్‌ ప్లాట్‌ఫామ్‌:
చేనేతలే కాకుండా, హస్తకళల ఉత్పత్తుల మార్కెటింగ్‌ కోసం అక్టోబరు 2వ తేదీ నుంచి ఈ–మార్కెటింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఏర్పాటు చేస్తున్నామని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ వెల్లడించారు. అందుకు మూడు బ్రిడ్జిలు ఉంటాయన్న ఆయన.. ఒకటి నాణ్యత కాగా, రెండోది లాజిస్టిక్స్‌ (సరుకులు వస్తువులు ఎలా, ఎక్కడ కొనుగోలు చేయాలి) అని, ఇక మూడోది వాటికి పేమెంట్స్‌ ప్రక్రియ అని చెప్పారు. 

ఆ తర్వాత జిల్లాలలో ఉన్న లబ్ధిదారులతో సీఎం వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు.
మంత్రులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఎం.శంకరనారాయణ, బొత్స సత్యనారాయణతో పాటు, పలువురు అధికారులు, నేతన్నల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాలో రోజుకు 3వేల టెస్టులు: నీలం సాహ్ని